ఎన్‌కౌంటర్‌లో 'దాదా' హతం | Tamil Nadu Police Encounter Rowdy manikandan | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో 'దాదా' హతం

Sep 26 2019 1:35 PM | Updated on Sep 26 2019 1:35 PM

Tamil Nadu Police Encounter Rowdy manikandan - Sakshi

మణికంఠన్‌ (ఫైల్‌)

సాక్షి, చెన్నై: అన్నానగర్‌లో విల్లుపురానికి చెందిన దాదా మణికంఠన్‌ ఎన్‌కౌంటర్‌లో హతం అయ్యాడు. విల్లుపురం, పుదుచ్చేరిలను వణికించి ఈ దాదా చెన్నైలో నక్కి ఉన్న సమచారంతో అక్కడి నుంచి వచ్చిన పోలీసులు తూటాలకు పనిపెట్టారు. కాగా, సినీ తరహాలో వంద మంది  ఈ దాదా ఇది వరకు రౌడీ రాజ్యాన్ని ఏళాడు. విల్లుపురం జిల్లా కుల్లం పాళయంకు చెందిన మణికంఠన్‌ గత పదిహేను సంవత్సరాలుగా విల్లుపురం, పుదుచ్చేరిల్లో తన కంటూ ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని దాదాగా చెలమణి అవుతూ వచ్చాడు. ఇక్కడే ఉన్న మరో దాదా రాజ్‌కుమార్‌ వర్గంతో మణికంఠన్‌ వర్గం నిత్యం తలబడుతూ వచ్చేది. సినీ తరహాలో మణికంఠన్‌ వంద మంది రౌడీలను తన పనులకు ఉపయోగించుకుంటూ రాజ్యాన్ని ఏళాడు. 21 హత్యలు, కిడ్నాప్‌లు అంటూ అనేక కేసులు మణి కంఠన్‌పై ఉన్నాయి. ఇటీవల చెన్నై అన్నానగర్‌లో జరిగిన  రిలయన్స్‌ బాబు హత్య కేసులోనూ మణికంఠన్‌ హస్తం ఉందని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో మణికంఠన్‌ అన్నానగర్‌ వెస్ట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో తలదాచుకుని ఉన్నట్టుగా విల్లుపురం ఎస్పీ జయకుమార్‌కు రహస్య సమాచారం అందింది. దీంతో సబ్‌ ఇన్‌స్పెక్టర్లు ప్రభు, ప్రకాష్‌ మంగళవారం రాత్రి ఆ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. మణికంఠన్‌ను పట్టుకున్నారు. అరెస్టు వారెంట్‌ చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు సమ్మతించినట్టు నటించినమణికంఠన్‌ ఇంట్లోకి రమ్మని ఆహ్వానించి హఠాత్తుగా ప్రభుపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆందోళన చెందిన ప్రకాష్‌ తన తుపాకీ తూటాను ఎక్కబెట్టాడు. రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడ్డ అతడ్ని చికిత్స నిమిత్తం కీల్పాకం ఆస్పత్రికి తరలించగా మరణించినట్టు వైద్యులు తేల్చారు. గాయపడ్డ ప్రభుకు చికిత్స అందిస్తున్నారు.

అన్న బాటలో తమ్ముళ్లు
మణికంఠన్‌కు ఓ అన్న, ఇద్దరు తమ్ముళ్లు, అక్క ఉన్నారు. అన్న గతంలో మరణించాడు. తమ్ముళ్లు ఇద్దరు మణికంఠన్‌కు కుడి, ఎడమ భుజంగా ఉండే వారు. ఐదేళ్ల క్రితం ప్రత్యర్థుల దాడిలో తమ్ముడు ఆర్ముగం హతం అయ్యారు. గత ఏడాది మరో తమ్ముడు మైఖెల్‌ కోర్టుకు వెళ్తున్న సమయంలో స్పృహ తప్పి మరణించాడు. తమ్ముళ్ల మరణంతో మకాంను చెన్నైకు మార్చేసి, ఇక్కడి నుంచే రహస్యంగా తన కార్యకలాపాల్ని మణికంఠన్‌ సాగిస్తూ వచ్చినట్టుగా విచారణలో తేలింది. గతంలో ఓ మారు ఎన్‌కౌంటర్‌ నుంచి తృటిలో తప్పించుకున్న మణి కంఠన్‌ ఈసారి పోలీసుల తూటాలకు బలయ్యాడు. మృతుడికి భార్య ఆనంది, ఇద్దరు కుమారులు, ఓకుమార్తె ఉన్నారు. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌ మీద పోలీసుల్ని వివరణ కోరుతూ మానవ హక్కుల కమిషన్‌ బుధవారం నోటీసులు జారీ చేసింది. నాలుగువారాల్లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement