స్వాదాద్రి రియల్ ఎస్టేట్ స్కాం: ముగ్గురు అరెస్ట్‌ | Swadadri Real Estate Scam: Three Arrested | Sakshi
Sakshi News home page

స్వాదాద్రి రియల్ ఎస్టేట్ స్కాం : ముగ్గురు అరెస్ట్‌

Jul 4 2020 4:49 PM | Updated on Jul 4 2020 8:41 PM

Swadadri Real Estate Scam: Three Arrested - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కుంభకోణం కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. స్వాదాద్రి రియల్‌ ఎస్టేట్‌ ఎండీ రఘుతో పాటు శ్రీనివాస్‌, మీనాక్షి అనే మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.  ప్రజ‌ల ద‌గ్గర నుండి డ‌బ్బులు వ‌సులు చేసి ఆ డ‌బ్బుల‌తో భూముల‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్ వెల్లడించారు. న‌గ‌రానికి చెందిన‌ యార్లగడ్డ రఘు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అధిక వడ్డీ ఇస్తానంటూ ప‌లువురిని న‌మ్మించి మోసం చేశారని సజ్జనార్‌ తెలిపారు. సుమారు మూడు వేల మంది మోసపోయినట్లు విచారణలో తేలిందన్నారు. ఇప్పటి వరకు 156 కోట్ల రూపాయల స్కాం జరిగిందని తెలిపారు. ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేసి మోసం చేశారని సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు. (చదవండి : మాదాపూర్‌లో భారీ మోసం)

న‌గ‌రానికి చెందిన‌ యార్లగడ్డ రఘు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అధిక వడ్డీ ఇస్తానంటూ ప‌లువురిని న‌మ్మించాడు. ఆ త‌ర్వాత వారి ద‌గ్గ‌ర‌ నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అత‌ని మాటలు న‌మ్మిన అనేక‌మంది పెద్ద మొత్తంలో ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఇదంతా మోస‌మ‌ని గ్ర‌హించిన ఓ బాధితుడు మాదాపూర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయడంతో కుంభకోణం బయటపడింది. ఈ స్కామ్‌లో ఏజెంట్ల పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement