మామపై కత్తితో అల్లుడి దాడి..

Son In Law Attack On Uncle Died At Asifabad - Sakshi

రెబ్బెన(ఆసిఫాబాద్‌): కక్షతో మామపై కత్తితో అల్లుడు దాడి చేసిన సంఘటన రెబ్బెనలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై దీకొండ రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గంగాపూర్‌కు చెందిన జాగిరి చంద్రయ్య తన కూతురు క్రిష్ణవేణిని పదేళ్ల క్రితం రెబ్బనకు చెందిన నానవేని లింగన్నకు ఇచ్చి వివాహం చేశాడు. తాగుడుకు బానిసైన లింగన్న భార్యను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. ఈక్రమంలో పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీ కూడా జరిగింది. అయినా లింగన్న ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈక్రమంలోనే లింగన్న అన్నదమ్ములతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు రాగా చంద్రయ్య చేరదీశాడు. అయినా మారని లింగన్న భార్యను నిత్యం కొట్టేవాడు. ఇదే క్రమంలో చంద్రయ్య ఇంట్లో నుంచి కూడా వెళ్లిపోయి వేరే చోట ఉన్నాడు.

అప్పుడు తన మేనత్త పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె కేసు పెట్టి జైలుకు పంపింది. జైలులో ఉన్న తనకు భార్య, మామ బెయిల్‌ ఇప్పించలేదని కక్ష పెంచుకున్నాడు. ఇటీవలే జైలు నుంచి వచ్చిన లింగన్న మామపై కక్షతో దాడి చేసేందుకు పథకం పన్నాడు. ఆదివారం రాత్రి గంగాపూర్‌ నుంచి రెబ్బెనకు వస్తున్న చంద్రయ్యను మండల కేంద్రంలోని పోస్టాఫీస్‌ ఎదుట అడ్డగించి వెంట తెచ్చుకున్న కత్తితో లింగన్న దాడికి పాల్పడ్డాడు. గమనించిన చంద్రయ్య తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎడమ కంటి బొమ్మపై తీవ్రగాయమైంది. చంద్రయ్య ఫిర్యాదుతో లింగన్నపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్ల డించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top