ఆర్థిక ఇబ్బందులతో నవదంపతుల ఆత్మహత్య   

New Couple Committed Suicide - Sakshi

పూడూరు రంగారెడ్డి : ఆర్థిక ఇబ్బందులతో నవ దంపతులు చెట్టుకు ఉరేసుకుని మృతిచెందిన సంఘటన వికారాబాద్‌ జిల్లా చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండల పరిధిలోని కంకల్‌ గ్రామానికి చెందిన డప్పు మల్లేశ్‌ అలియాస్‌ సద్గురు(19), జ్యోతి (18) ఇరువురు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు.. ఐదు నెలల క్రితం పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు.

మల్లేశ్‌ పరిగిలో పంక్చర్‌ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. భార్య జ్యోతి వ్యవసాయ పనులు చేస్తూ చేదోడువాదోడుగా ఉండేది. శనివారం ఉదయం మల్లేశ్‌ తన తల్లి, భార్యతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. పనులు ముగించుకున్న తర్వాత.. చీకటి పడుతుంది తాము బైక్‌పై వస్తామని చెప్పి తల్లిని ఇంటికి పంపించాడు. కొడుకు, కోడలు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లి కుటుంబసభ్యులతో పొలం వద్దకు వెళ్లింది.

చుట్టుపక్కల్లో వెతకగా.. దంపతులిద్దరూ చెట్టుకు ఉరేసుకుని కనిపించారు. వెంటనే కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక ఇబ్బందులతోనే తన అల్లుడు, కూతురు ఆత్మహత్య చేసుకున్నారని జ్యోతి తల్లి మాణెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అందరితో సన్నిహితంగా ఉంటూ జీవనం సాగిస్తున్న మల్లేశ్, జ్యోతిల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top