పట్టపగలు వ్యక్తి దారుణ హత్య

Murder Case  In Medak District - Sakshi

మైలార్‌దేవ్‌పల్లి (మెదక్‌): గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు పట్టపగలు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. సీఐలు సత్తయ్యగౌడ్, రామకృష్ణ, ఎస్‌ఐ మహ్మద్‌ నదీం హుస్సేన్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. శాస్త్రీపురం ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అమ్జద్‌ (50) తలుపుల వ్యాపారి. శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి షాపులో కూర్చున్న అమ్జద్‌ను సుత్తితో బలంగా కొట్టి హత్య చేశారు. హత్య చేసిన వెంటనే వచ్చిన ఆటోలో తిరిగి పరారయ్యారు. రక్తపుమడుగులో ఉన్న అమ్జద్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. మృతుడు అమ్జద్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు.

వారిలో ప్రథమ పుత్రుడు మోసిన్, చిన్న కుమారుడు ఆసిన్‌లు నిత్యం ఇతరులతో గొడవలు పడుతుంటారు. ఈ తగాదాల కారణంగానే తెలిసిన వారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. ఏసీపీ అశోక్‌కుమార్, క్లూస్‌ టీమ్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ కెమెరాల ద్వారా త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top