అసభ్య రాతల్ని అడ్డుకున్న బాలికలపై దాడి
సుపౌల్: స్కూలు గోడలపై అసభ్య రాతలను అడ్డుకున్న విద్యార్థినులపై గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన బిహార్లో చోటుచేసుకుంది. సుపౌల్ జిల్లాలోని దర్పాఖ గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం(కేజీబీవీ) పక్కనే మరో స్కూలు ఉంది. అయితే కేజీబీవీ బాలికలు మైదానంలో ఆడుకుంటుండగా అక్కడకు చేరుకున్న కొందరు పక్క స్కూలు అబ్బాయిలు గోడలపై అసభ్య రాతలు రాశారు. దీంతో ఆ అమ్మాయిలు వీళ్లను తన్నితరిమేశారు. వీరంతా ఇళ్లకు వెళ్లి తమపై జరిగిన దాడిని తల్లిదండ్రులకు చెప్పడంతో గ్రామస్తులంతా ఏకమై మైనర్ బాలికలపై ఒక్కసారిగా దాడి చేశారు. ఈ ఘటనలో 30 మంది అమ్మాయిలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు, ఓ మహిళ సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు.