ఉలికిపాటు

Maoists Attack On MLA  Kidari Sarveswara Rao Case Kurnool - Sakshi

ఆత్మకూరు (కర్నూలు): విశాఖపట్నం జిల్లా అరకు లోయలో మావోయిస్టులు ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను ఆదివారం కాల్చిచంపడంతో జిల్లా ప్రజలు సైతం ఉలికిపాటుకు గురయ్యారు. గతంలో జిల్లాలో..మరీ ముఖ్యంగా నల్లమల ప్రాంతంలో నక్సల్స్‌ కార్యకలాపాలను గుర్తుకు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆత్మకూరు ప్రాంతంలో ‘పీపుల్స్‌వార్‌ బవనాసి’ పేరుతో నక్సల్స్‌ కార్యకలాపాలు నిర్వహించారు. వారి ఉనికి ఎంతో బలంగా ఉండేది. 1999లో అప్పటి ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా వెంగళæరెడ్డిని పీపుల్స్‌వార్‌ బవనాసి దళ సభ్యులు పట్టణంలోని పాత డీఎస్పీ బంగ్లా అతిథిగృహంలో కాల్చి చంపారు. పోలీస్‌ దుస్తులను ధరించిన వ్యక్తులు బుడ్డా వెంగళరెడ్డి దగ్గరకు వెళ్లి మాట్లాడుతూ ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. వాస్తవానికి 1995–96 ప్రాంతంలో అప్పటి పీపుల్స్‌ వార్‌ సభ్యులు (ప్రస్తుతం మావోయిస్ట్‌లు) తెలంగాణ ప్రాంతం నుంచి నల్ల మల అభయారణ్యం సమీపంలోని కొత్తపల్లి మండలం జానాల గూడెం చేరుకుని ఈ ప్రాంతాన్ని షెల్టర్‌జోన్‌గా ఉపయోగించుకున్నారు.

నాలుగేళ్లలోనే అటవీ సమీప గ్రామాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని తమ కార్యకలాపాలను కొనసాగించారు. అప్పటి దళం కృష్ణ నాయకత్వంలో పనిచేసింది. అయితే..అతను పుట్టిలో కృష్ణానదిని దాటే క్రమంలో ప్రమాదవశాత్తు మరణించాడు. అనంతరం వరంగల్‌ జిల్లాకు చెందిన శ్యామ్‌ కర్నూలు జిల్లాలో నాయకత్వ బాధ్యతలు చేపట్టి.. పార్టీని మరింత బలోపేతం చేశారు. అప్పçట్లో  పీపుల్స్‌వార్‌ సభ్యులు పలు సంఘటనలకు పాల్పడి ఉనికిని బలంగా చాటారు. మరీ ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో వీరి కదలికలు అధికంగా ఉండేవి. వడ్ల రామాపురం, వేంపెంట, నల్లకాలవ, బండి ఆత్మకూరు మండలం నారాయణపురం, సంతజూటూరు, మహానంది మండలం గాజులపల్లెతో పాటు ఆళ్లగడ్డ మండలంలోనూ చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించారు.

2003 సంవత్సరంలో బైర్లూటీ, వెలుగోడు తదితర ప్రాంతాలలో అటవీశాఖ భవనాలను పేల్చేశారు. అదే ఏడాది ఇందిరేశ్వరం గ్రామంలో కరువు దాడి నిర్వహించారు. 2004లో సున్నిపెంట పోలీస్‌స్టేషన్‌ను పేల్చివేయడం సంచలనమైంది. 2005 జనవరి 15న బైర్లూటీ వద్ద కొవ్వూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును తగులబెట్టారు. అదే ఏడాది మార్చి ఒకటో తేదీన వేంపెంట ఊచకోత ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలా పలు ఘటనలతో బలంగా ఉనికిని చాటుతూ వచ్చిన నక్సల్స్‌ ప్రభావం ఆ తర్వాత క్రమేణా తగ్గుతూ వచ్చింది. గత కొన్నేళ్లుగా జిల్లాలో వారి కార్యకలాపాలేవీ లేవు. అయితే..ఆదివారం అరకు ఎమ్మెల్యే హత్యతో మళ్లీ అలజడి రేగింది. ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఆందోళన చెందుతున్నారు. 

మావోల కదలికలు లేవు 
ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా మావోయిస్టుల కదలికలు లేవు. ఈ విషయంపై మేం సమగ్రంగా విచారణ చేశాం. ఎక్కడా వారి ఉనికి బయటపడలేదు. – మాధవరెడ్డి, ఏఎస్పీ  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top