ప్రేమజంట ఆత్మహత్య

Love Couple Commits Suicide In Tamil Nadu - Sakshi

తమిళనాడు, కెలమంగలం: ఆ యువకుడు టెన్త్‌ చదివి పొలంబాట పట్డాడు. ఆ యువతి డిగ్రీ పూర్తి చేసింది. ఇద్దరూ స్వయాన బంధువులు. వారి ఇళ్లు కూడా ఎదురెదురుగా ఉన్నాయి. చిన్నప్పటినుంచి కలిసి పెరిగారు. కాలక్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించింది.  జీవితాంతం ఒక్కటిగా ఉండిపోవాలని కలలుగన్నారు. అయితే ఏ కారణం చేతనో ఇద్దరూ బలవన్మరణం చెందారు.  ఈ ఘటన క్రిష్ణగిరి జిల్లా డెంకణీకోట తాలూకా సావరబెత్తంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన హనుమప్ప కొడుకు హేమంత్‌(25) 10వ తరగతికే చదువు ముగించుకొని వ్యవసాయం చేస్తున్నాడు.  ఎదురింటిలో ఉంటున్న అత్త కుమార్తె  చూడమ్మ(21) డిగ్రీ పూర్తి చేసింది. వీరిరువురూ  గాఢంగా ప్రేమించుకొన్నారు.

అయితే ఈ విషయం వారి తల్లితండ్రులు తెలియదు. చిన్నప్పటినుంచి పెద్దల చాటున పెరిగిన పిల్లలు కావడంతో తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పేందుకు జంకారు. ఒకవేళ పెద్దలకు విషయాన్ని చెబితే తమ పెళ్లికి అంగీకరిస్తారో లేదో అనే బెంగతో ఉండేవారు. ఈక్రమంలో ఇద్దరూ చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో విగతజీవులుగా మారారు. గురువారం ఉదయం పొలం పనులకు వెళ్లే గ్రామస్తులు.. పొలంలో హేమంత్, చూడమ్మలు ఒకే చెట్టుకు ఉరివేసుకున్నట్లు గమనించి హతాశులయ్యారు. విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో ఘటనా స్థలంలో గుమికూడారు. నిన్నటి వరకు తమ కళ్లముందు తిరగాడిన పిల్లలు ఇలా విగతజీవులుగా మారడాన్ని  జీర్ణించుకోలేక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తళి  ఎస్‌ఐ శివరాజు    కేసు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top