కలిసి బతకలేమని.. కలిసి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

కలిసి బతకలేమని.. కలిసి ఆత్మహత్య

Published Tue, Jul 23 2019 7:17 AM

Love Couple Commits Suicide in Karnataka - Sakshi

కర్ణాటక, కెలమంగలం: ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ పెద్దలు అంగీకరించలేదు. విడిపోవడం ఇష్టలేక మరణంలోనైనా కలిసుందామని తీర్మానించుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందో యువ జంట. ఈ సంఘటన కెలమంగలం సమీపంలో చోటు చేసుకొంది. హొసూరు– కెలమంగలం రైలురోడ్డుపై కారుగొండపల్లి వద్ద యువతీ, యువకుడు రైలు క్రిందపడి ఆత్మహత్య చేసుకొన్నట్లు హొసూరు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికెళ్లి మృతదేహాలను స్వాధీనపరుచుకొని శవపరీక్ష కోసం హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారించగా హొసూరు సమీపంలోని పేరండపల్లి – బేరికె రోడ్డులోని రామచంద్రం గ్రామానికి చెందిన యల్లేష్, జ్యోతిగా తెలిసింది. 

అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించారని  
మునిరాజు కొడుకు యల్లేష్‌ (25) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన క్రిష్ణప్ప కూతురు జ్యోతి(21) డిగ్రీ ముగించి ఇంట్లోనే ఉంటుంది. ఇరువురూ ఒకే కులానికి చెందినవారు. గత రెండేళ్లుగా ప్రేమించుకొన్నారు. యల్లేష్‌ లారీ డ్రైవర్‌గా పనిచేయడం ఇష్టంలేని జ్యోతి తల్లిదండ్రులు వీరి వివాహానికి అడ్డపడ్డారు. దీంతో ప్రేమజంట భయానక నిర్ణయం తీసుకుంది. ఆదివారం రాత్రి ఇరువురూ ద్విచక్రవాహనంలో కెలమంగలం వైపు వెళ్లారు. రాత్రి కారుగొండపల్లి వద్ద రైల్వే ట్రాక్‌ ప్రక్కన ద్విచక్రవాహనాన్ని నిలిపి కుర్లా ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాలు ముక్కలయ్యాయి. ఈ సంఘటన జిల్లా అంతటా సంచలనం సృష్టించింది. 

Advertisement
Advertisement