
సాక్షి, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుందనే కారణంతో తల్లిదండ్రులే ఓ యువతికి గుండు కొట్టించారు. పైడిపల్లిలో పెద్దలను ఎదిరించి ప్రవీణ్ అనే యువకుడిని గత నెల 28న బాధిత యువతి ప్రేమ వివాహం చేసుకుంది. పోలీసుల సహకారంతో వారు ఈ నెల 22న స్వగ్రామానికి వచ్చారు.
కూతురి ప్రేమ వివాహం నచ్చని తల్లిదండ్రులు.. ఆమెను భర్త ఇంటి నుంచి బలవంతంగా తీసుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఆమెకు గుండుకొట్టించి బంధువుల ఇంట్లో ఉంచారు. విషయం తెలుసుకున్న భర్త ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించాడు. ప్రవీణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.