అంతమొందించి.. అంతులేకుండా వెళ్లాడు.. | Husband Killed Wife And Escape in Prakasam | Sakshi
Sakshi News home page

అంతమొందించి.. అంతులేకుండా వెళ్లాడు..

Feb 7 2020 1:18 PM | Updated on Feb 7 2020 1:18 PM

Husband Killed Wife And Escape in Prakasam - Sakshi

ఆదిలక్ష్మి మృతదేహం

ప్రకాశం కొనకనమిట్ల: వివాహేతర సంబంధం వద్దని వారించిన భార్యను ఓ వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా చంపేసి పరారయ్యాడు. ఈ సంఘటన మండలంలోని మంగాపురం ఎస్సీ కాలనీలో గురువారం జరిగింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని మునగపాడుకు చెందిన దమ్ము వెలుగొండయ్య, ఎర్రక్క దంపతుల కుమార్తె ఆదిలక్ష్మి(35)ని మంగాపురం గ్రామానికి చెందిన శిగినం లక్ష్మీనారాయణకు ఇచ్చి వివాహం చేశారు. ఇతడు బేల్దారి పనులు చేస్తుంటాడు. వీరికి మణికంఠ, మాధవి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. లక్ష్మీనారాయణ ఇటీవల వేరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇది తెలిసిన భార్య.. భర్తను నిలదీసింది. ఈ విషయమై దంపతులు ఇంట్లో గొడవ పడ్డారు.

తీవ్ర ఆగ్రహం చెందిన భర్త.. ఆదిలక్ష్మిని ఇంట్లో ఉన్న కేబుల్‌ వైరును ఆమె మెడకు బిగించి చంపాడు. ఆ తర్వాత ఏం తెలియనట్లు బయటకు వచ్చి ఆదిలక్ష్మి పలకడం లేదు.. పడిపోయిందంటూ పక్కనున్న బంధువులతో చెప్పి పరారాయ్యాడు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు మంగాపురం వెళ్లి తమ కుమార్తె మృతి చెంది ఉండటాన్ని చూసి భోరున వలపించారు. అల్లుడే తమ కుమార్తెను చంపాడని ఆరోపించారు. తల్లి మృతి చెందటంతో ఇద్దరు పిల్లలు విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆదిలక్ష్మి మృతికి కారణాలు బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరనాయక్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement