వేకువనే విషాదం

Friends Died In Innova And Omni Accident - Sakshi

ఓమ్ని వ్యాన్‌ను ఢీకొన్న ఇన్నోవా  

వ్యాన్‌లోని నలుగురు యువకులు మృతి   

కెంపేగౌడ ఎయిర్‌పోర్టు రోడ్డులో దుర్ఘటన  

పుట్టినరోజు వేడుకకు  నందిహిల్స్‌కు వెళ్తుండగా ఘోరం

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: స్నేహితుని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి ఉత్సాహంగా నందికొండకు బయలుదేరిన యువకులను మార్గం మధ్యలోనే మృత్యువు బలితీసుకుంది. కొందరు విగతజీవులు కాగా, మరికొందరు క్షతగాత్రులయ్యారు. కెంపేగౌడ ఎయిర్‌పోర్టు రోడ్డులోని కన్నమంగలపాళ్య గేట్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓమ్ని వ్యాన్‌ను వెనుక నుండి వేగంగా వచ్చిన ఇన్నోవాకారు ఢీకొట్టింది. ఓమ్ని వ్యాన్‌లో ఉన్న 9 మంది యువకుల్లో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇన్నోవా కారులో ఉన్న ముగ్గురు స్వల్పగాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. మృతులను వెంకటేశ్‌ (28), సతీష్‌ (24), వికాస్‌(23), సుందర్‌ (25)లుగా గుర్తించారు.  

అందరూ చిరుద్యోగులే
ఓమ్నివ్యాన్‌లోని యువకులు బెంగళూరు ఆర్‌టీ నగర్‌లో ఫ్లవర్‌ డెకొరేషన్‌ పని చేసేవారు. అరకొర జీతంలో కాస్త ఇంట్లో ఇస్తూ పొట్టపోసుకునేవారు. వీరిలో ఒకరి పుట్టినరోజు కావడంతో వేడుకలను నందికొండ లో జరుపుకోవాలని బుధవారం తెల్లవారుజామునే బయలుదేరారు. ఎయిర్‌పోర్టు రోడ్డులో కొత్తగా తారు వేసి వైట్‌ ట్యాపింగ్‌ ట్రాక్‌ వేయకపోవడం, మలుపుల్లో రేడియం స్టిక్కర్‌లు వంటివి లేకపోవడం ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీస్‌ కమిషనర్‌ హరిశేఖరన్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కెంపేగౌడ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top