
తణుకులో నిందితుడిని అరెస్టు చేసి వివరాలు వెళ్లడిస్తున్న సీఐ కేఏ స్వామి
తణుకు : పోలీసు శాఖలో పని చేసిన అనుభవం... హోంగార్డుగా కొన్నేళ్ల పాటు పని చేసిన అతడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు... దీంతో ఉద్యోగం నుంచి బయటకు వచ్చి విద్యార్థులు, ఒంటరిగా ఉన్న యువకులను బెదిరించి వారి నుంచి బంగారు ఆభరణాలను అపహరించుకుపోవడమే ప్రవృత్తిగా మరల్చుకున్నాడు.
విజయవాడ గాంధీనగర్కు చెందిన కాళిదాసు విజయకృష్ణ 2004 వరకు హోంగార్డుగా పని చేసి మానేశాడు. అనంతరం సెక్యూరిటీగా పని చేశాడు. ఆ సమయంలో ఒక యువతిని మోసం చేసి పెళ్లి చేసుకున్న ఘటనలో అతడిపై కిడ్నాప్ కేసు నమోదైంది.
ఈ కేసులో జైలుశిక్ష అనుభవించి 2010లో పలు చోరీలకు పాల్పడి మరోసారి జైలుకు వెళ్లాడు. 2016లో జైలు నుంచి బయటకు వచ్చిన అతడు ఏలూరులో మరో మహిళను వివాహం చేసుకుని జీవిస్తున్నాడు. ఈ క్రమంలో కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వారి నుంచి చాకచక్యంగా బంగారు ఆభరణాలను అపహరించుకుపోతున్నాడు.
ఇలా తణుకు, భీమవరం, వీరవాసరం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో పలు నేరాలకు పాల్పడిన అతడిని మంగళవారం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.2 లక్షలు విలువైన 84 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ మేరకు తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కేఏ స్వామి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.