స్కూల్లోకి చొరబడి బీభత్సం చేసిన చిన్నపిల్లలు
న్యూయార్క్: ముగ్గురు పిల్లల ఆకతాయితనం కారణంగా ఓ స్కూలు తీవ్రంగా నష్టపోయింది. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల క్రితం ఓక్లహామాకు చెందిన 6,8,12 సంవత్సరాల వయస్సు కలిగిన ముగ్గురు పిల్లలు అక్కడి అట్లాస్ ఇంటర్మీడియట్ స్కూల్ డోరు గ్లాసు బద్ధలు కొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడి నేలపై, టేబుళ్లు, డోర్లపై రంగులు చల్లారు. సామాన్లను చిందరవందర చేసి, పేపర్లను విసిరికొట్టి.. కంప్యూటర్లు పాడుచేశారు. అంతటితో ఆగకుండా మంటలు ఆర్పే యంత్రాలతో నానా భీభత్సం సృష్టించారు. ( ఫ్లాయిడ్కు కన్నీటి వీడ్కోలు )
దీంతో దాదాపు 50 వేల డాలర్ల నష్టం వాటిల్లింది. వీరి చేష్టలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డవటంతో గత ఆదివారం నాడు పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరిపిన అనంతరం వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. సంఘటనకు సంబంధించిన చిత్రాలను సైతం సోషల్ మీడియాలో విడుదల చేశారు. అయితే నష్టపరిహారాన్ని పిల్లల తల్లిదండ్రుల వద్ద నుంచి భర్తీ చేస్తారా? పిల్లలు చట్టపరంగా శిక్ష అనుభవిస్తారా? అన్నది తెలియరాలేదు.