
సాక్షి, బంగారుపాళెం: చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలంలోని కేజీ సత్రం వద్ద చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆర్టీసీ బస్సు, టెంపో ట్రావెలర్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్గఢ్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 11మంది బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతి నుంచి టెంపో ట్రావెలర్ వాహనం మాట్లాడుకుని మైసూరుకు వెళుతుండగా మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యారు.
బెంగళూరు నుంచి తిరుమలకు వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పుష్ప (48), నిషా సాహు (19), మునీషా సాహు (23) అక్కడికక్కడే చనిపోయారు. రామ్నాథ్ సాహు (64), శరత్ సాహు (45), అనంతపురం జిల్లాకు చెందిన టెంపో డ్రైవర్ గిరి తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడినవారిని చిత్తూరు, బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు.