రూ. 12 వేల కోట్ల లెక్క తప్పింది!!

SBI Stubbornness Increased In RBI Audit - Sakshi

ఆర్‌బీఐ ఆడిట్‌లో పెరిగిన ఎస్‌బీఐ మొండిబాకీలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గత ఆర్థిక సంవత్సర ఫలితాల్లో దాదాపు రూ.12,000 కోట్ల మేర మొండిబాకీలు బయటపడలేదు. రిజర్వ్‌ బ్యాంకు ఆడిట్‌లో రూ.11,932 కోట్ల మేర వ్యత్యాసం (డైవర్జెన్స్‌) వచ్చినట్లు ఎస్‌బీఐ మంగళవారం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఫలితాల్లో.. స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) రూ.1,72,750 కోట్లుగా ఎస్‌బీఐ లెక్కించింది. అయితే, ఇవి మరో రూ.11,932 కోట్లు పెరిగి రూ.1,84,682 కోట్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ మదింపు చేసింది. అలాగే, నికర ఎన్‌పీఏలు రూ.65,895 కోట్లుగా ఎస్‌బీఐ వెల్లడించగా.. ఇవి రూ. 77,827 కోట్లుగా ఉంటాయని ఆర్‌బీఐ లెక్కించింది.

దీంతో రూ.12,036 కోట్ల మేర అదనంగా ప్రొవిజనింగ్‌ చేయాల్సి వచ్చిందని, దీని ప్రకారం చూస్తే రూ.6,968 కోట్ల మేర నష్టం నమోదు చేయాల్సి వచ్చేదని స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు ఎస్‌బీఐ తెలియజేసింది. 2018–19లో ఎస్‌బీఐ రూ.862 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఆర్థికంగా మెరుగైన పనితీరు చూపించుకునేందుకు బ్యాంకులు.. మొండిబాకీల పరిమాణాన్ని తక్కువ చేసి చూపిస్తుండటాన్ని ఆర్‌బీఐ కొన్నాళ్లుగా నిశితంగా పరిశీలిస్తోంది. లెక్కలను స్వయంగా మదింపు చేస్తోంది. రెండింటి మధ్య తేడాలేమైనా ఉంటే సత్వరం చర్యలు తీసుకుంటోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top