యస్‌ బ్యాంక్‌లో కపూర్‌ | Sakshi
Sakshi News home page

యస్‌ బ్యాంక్‌లో కపూర్‌

Published Fri, Sep 20 2019 6:16 AM

Rana Kapoor-owned Morgan Credits sells promoter stake in Yes Bank - Sakshi

న్యూఢిల్లీ: యస్‌ బ్యాంక్‌లో ప్రమోటర్‌ సంస్థ, మోర్గాన్‌ క్రెడిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎమ్‌సీపీఎల్‌) 2.3 శాతం వాటాకు సమానమైన 5.8 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.58.1 ధరకు విక్రయించింది. వీటి విలువ రూ.334 కోట్లు. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌(ఆర్‌నామ్‌) ఎన్‌సీడీలకు ముందుగానే చెల్లింపులు జరపడానికి, మరోవైపు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం యస్‌బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటా తగ్గించుకునే క్రమంలో భాగంగా మోర్గాన్‌ క్రెడిట్స్‌ ఈ షేర్లను విక్రయించింది. యస్‌ బ్యాంక్‌ మాజీ సీఈఓ రాణా కపూర్‌కు చెందిన ముగ్గురు కూతుళ్లు ఈ ఎమ్‌సీపీఎల్‌ను నిర్వహిస్తున్నారు.

ఈ వాటా విక్రయంతో రాణా కపూర్‌ కుటుంబం వాటా యస్‌ బ్యాంక్‌లో 7.4 శాతానికి తగ్గుతుంది. యస్‌ బ్యాంక్‌ 2004 నుంచి కార్యకలాపాలు నిర్వహించడం మొదలు పెట్టిందని, గత 15 ఏళ్లలో మంచి వృద్ధిని సాధించామని రాణా తెలిపారు. మోర్గాన్‌ క్రెడిట్స్‌ కంపెనీ 2018 ఏప్రిల్‌లో  ఆర్‌నామ్‌)కి నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లు (ఎన్‌సీడీ)జారీ చేసి రూ.1,160 కోట్లు సమీకరించింది. ఈ బాండ్లు 2021, ఏప్రిల్‌లో మెచ్యూర్‌ అవుతాయి. ఈ బాండ్ల ద్వారా సమీకరించిన  నిధులను స్టార్టప్‌ బిజినెస్‌ల కోసం మోర్గాన్‌ క్రెడిట్స్‌ వినియోగించింది. ఈ బాండ్లకు సంబంధించి ముందస్తుగా చెల్లించాల్సిన(వడ్డీతో కలుపుకొని) మొత్తం ఇప్పటిదాకా రూ.722 కోట్లుగా ఉంది. యస్‌బ్యాంక్‌లో విక్రయించిన వాటా ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆర్‌నామ్‌ ఎన్‌సీడీలకు చెల్లింపులు జరపడానికి  మోర్గాన్‌ క్రెడిట్స్‌ ఉపయోగించనున్నది.

Advertisement
Advertisement