క్రెడిట్‌ కార్డు మోసం: డబ్బులు పోతే ఏంచేయాలి?

క్రెడిట్‌ కార్డు మోసం: డబ్బులు పోతే ఏం చేయాలి?


సాక్షి, ముంబై: ఇటీవలి కాలంలో క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల అక్రమ లావాదేవీలు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కార్డు యజమానికి తెలియకుండా కార్డు విదేశాలలో స్వైపింగ్ కావడం, కస్టమర్ల లక్షల కొద్దీ డబ్బులు పోగొట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఖాతాదారుల ప్రమేయం, ఓటీపీ లాంటి వాటితో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌ షాపింగ్‌ తదితర ప్రాంతాల్లో కార్డు స్వైపింగ్‌ కావడం మరింత ఆందోళన సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల ప్రమేయం లేకుండా క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల నుంచి డబ్బులు మాయమైతే ఏం చేయాలి. దీనికి ఆర్‌బీఐ ఇటీవలి మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి. ఒకసారి చూద్దాం!


 

ఇలాంటి లావాదేవీలను గుర్తించినపుడు ఎలాంటి ఆందోళన చెందాల్సి అవసరం లేదు. అనుమానిత లావాదేవీ జరిగినట్టు గుర్తించిన వెంటనే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి లేదా బ్యాంకుకు ఫోన్ చేసి కార్డును బ్లాక్‌ చేయించాలి. అలాగే బ్యాంకు అంబుడ్స్‌మెన్‌లలో ఫిర్యాదు చేయడంతో పాటు సైబర్‌క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. తద్వారా మీ కార్డుపై మీకు తెలియకుండా జరిగిన లావాదేవీలకు మీరు బాధ్యులు కారు. అలాంటి కేసులలో వినియోగదారుడికి ఎలాంటి నష్టం కలగకుండా, భారం పడకుండా చర్యలు తీసుకోవడంతో వెంటనే తాత్కాలికంగా మరో కార్డును వినియోగదారుడికి అందించే ఏర్పాటు కూడా చేస్తుంది. ఆ తరువాత వినియోగదారుడి కార్డు ఎక్కడ ఉపయోగించారనే విషయంపై బ్యాంకు ఆరా తీస్తుంది. వినియోగదారుడి ప్రమేయం లేకుండా జరిగిన లావాదేవీలకు సంబంధించి వాస్తవంగా మీకు తెలియకుండా జరిగిందా? కావాలనే మీరు చేయించారా? అనే విషయాలపై కూడా కనుగొంటుంది. 

 

క‌స్ట‌మ‌ర్లు ఎల‌క్ట్రానిక్ లావాదేవీల్లో త‌మ ప్ర‌మేయం లేకుండా జ‌రిగే లావాదేవీల‌కు సంబంధించి మూడు రోజుల్లో బ్యాంకు లేదా ఆర్‌బీఐకి తెలియ‌జేస్తే, దానికి సంబంధించిన సొమ్మును 10 రోజుల్లోపు తిరిగి చెల్లిస్తుంది. క‌స్ట‌మ‌ర్ ప్ర‌మేయం లేకుండా జ‌రిగే థ‌ర్డ్ పార్టీ మోసాల‌కు బ్యాంకు ఖాతాదారు ఎలాంటి న‌ష్టాన్ని భ‌రించాల్సిన అవ‌స‌రం లేదు.  అయితే కార్డు లేదా ఆన్‌లైన్ లావాదేవీ నుంచి డ‌బ్బు కోల్పోయిన‌ట్ల‌యితే మూడు ప‌నిదినాల్లోగా దాన్ని బ్యాంకుకు తెలియ‌ప‌ర‌చాల్సి ఉంటుంది. ఒక వేళ మోసాన్ని నాలుగు నుంచి ఏడు ప‌నిదినాల్లోగా తెలియ‌జేసిన‌ట్ల‌యితే, బ్యాంకు ఖాతాదారు గ‌రిష్టంగా రూ.5000 నుంచి రూ.25 వేల వ‌ర‌కూ న‌ష్టాన్ని భ‌రించాల్సి రావ‌చ్చు. అది ఖాతా ర‌కం, క్రెడిట్ కార్డు ప‌రిమితిని బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది.

 

ఖాతాదారు నిర్ల‌క్ష్యం( ఓటీపీ, సీవీవీ లాంటి వివ‌రాలు వెల్ల‌డించ‌డం ద్వారా) కార‌ణంగా మోసం జ‌రిగిన సంద‌ర్భంలో న‌ష్టాన్ని బ్యాంకు భ‌రించ‌దు. అది ఖాతాదారే భ‌రించాల్సి ఉంటుంది. కానీ అన‌ధికారిక లావాదేవీ గురించి బ్యాంకుకు తెలియ‌జేసిన వెంట‌నే మ‌ళ్లీ ఏదైనా అనుమాన‌స్ప‌ద లావాదేవీ జ‌రిగితే ఆ న‌ష్టాన్ని బ్యాంకు భ‌రిస్తుంది. ఏదైనా మోస‌పూరిత లావాదేవీ జ‌రిగిన త‌ర్వాత బ్యాంకు ఖాతాదారు స‌ద‌రు బ్యాంకుకు నివేదిస్తే, ఆ అన‌ధికారిక లావాదేవీకి సంబంధించిన సొమ్మును బ్యాంకు 10 ప‌నిదినాల్లోగా ఖాతాదారు బ్యాంకు ఖాతాకు జ‌మ చేయాల్సి ఉంటుంది. ఎంత సొమ్ము వెన‌క్కు వ‌స్తుంద‌నే అంశం అన‌ధికారిక లావాదేవీ జ‌రిగిన రోజు ఎంత డ‌బ్బు మిన‌హాయించ‌బ‌డింద‌నే దానిపై ఆధార‌ప‌డి ఉంటుంది.

 

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం మన దేశంలో క్రెడిట్ కార్డుతో జరిగే లావాదేవీలలో ఓటీపీ, పిన్ తప్పని సరిగా ఉంటాయి. ఆన్‌లైన్‌లో కార్డు వివరాలను ఉపయోగించి జరిగే లావాదేవీలలో ఓటీపీ, కార్డును నేరుగా ఉపయోగించి జరిగే లావాదేవీలలో పిన్ నెంబర్ తప్పని సరిగా ఉపయోగించాలి. అయితే అంతర్జాతీయంగా కొన్ని దేశాలలో ఆన్‌లైన్‌లో జరిగే లావాదేవీలకు ఓటీపీ అనేది తప్పనిసరి కాదు. ఇలాంటి లావాదేవీలు కార్డు నెంబరు, సీవీవీ, గడువు తేదీ వంటి వివరాలు ఉంటే సరిపోతుంది. దీనినే సైబర్‌ చీటర్లు ఆసరాగా చేసుకుంటున్నట్లు పోలీసులు, బ్యాంకు అధికారులు అనుమానిస్తున్నారు. కార్డుపైనే ఈ వివరాలు ఉండడంతో ఇవి తస్కరణకు గురయ్యే అవకాశాలుంటాయి. దీంతో కార్డును ఎవరికి ఇవ్వకపోవడం, ఎక్కడ పడితే అక్కడ స్వైపింగ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్డుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలి.

 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top