ఆటోమేషన్తో ఉద్యోగాలకు ఎసరు | Automation Threatens 69 Per Cent Jobs In India: World Bank | Sakshi
Sakshi News home page

ఆటోమేషన్తో ఉద్యోగాలకు ఎసరు

Oct 6 2016 1:34 AM | Updated on Sep 4 2017 4:17 PM

ఆటోమేషన్తో ఉద్యోగాలకు ఎసరు

ఆటోమేషన్తో ఉద్యోగాలకు ఎసరు

ఆటోమేషన్‌తో భారత్‌లో 69 శాతం ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఇది చైనాలో 77 శాతంగా ఉంటుందని తెలిపింది.

భారత్‌లో 69 శాతంగా ఉంటుంది: ప్రపంచ బ్యాంకు
వాషింగ్టన్: ఆటోమేషన్‌తో భారత్‌లో 69 శాతం ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఇది చైనాలో 77 శాతంగా ఉంటుందని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంప్రదాయ ఆర్థిక విధానాలను టెక్నాలజీ పూర్తిగా మార్చేస్తుందని పేర్కొంది. వృద్ధిని పెంచుకునేందుకు మౌలిక రంగంలో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలని సూచించింది. అయితే, భవిష్యత్తు ఆర్థిక విధానాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి మౌలిక సదుపాయాలు అవసరమో ఆలోచన చేయాల్సి ఉందని పేర్కొంది.

‘ప్రపంచాన్ని టెక్నాలజీ సమూలంగా మార్చేస్తుందనే విషయం మనకు తెలిసిందే. అయితే, సంప్రదాయ ఆర్థిక విధానమైన వ్యవసాయం, తక్కువ స్థాయిలో తయారీ రంగం నుంచి పూర్తి స్థాయి పారిశ్రామిక దేశంగా మారిపోవడం అన్నది అన్ని వర్ధమాన దేశాలకు సాధ్యమయ్యేది కాదు’ అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌కిన్ అన్నారు. వాషింగ్టన్‌లోని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో పేదరికంపై జరిగిన చర్చా కార్యక్రమం సందర్భంగా జిమ్‌కిన్ ఈ అంశాలను వెల్లడించారు.

 కిమ్ ఏం చెప్పారంటే...
ప్రపంచ బ్యాంకు పరిశోధన ప్రకారం ఆటోమేషన్ (మనుషులు చేసే పనిని యంత్రాలతో చేయించుకోవడం) వల్ల భారత్‌లో 69 శాతం, చైనాలో 77 శాతం, ఇథియోపియాలో 85 శాతం ఉద్యోగాలకు ముప్పు ఉంది. ఇదే గనుక వాస్తవ రూపం దాలిస్తే ఈ దేశాలు అధిక సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోతాయి. ఈ దృష్ట్యా ఆర్థికాభివృద్ధికి అందుబాటులో ఉన్న మార్గాలను అర్థం చేసుకుని అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలి. యాంత్రీకరణ, టెక్నాలజీలు సంప్రదాయ పారిశ్రామిక తయారీని దెబ్బతీశాయి. దీంతో మాన్యువల్ ఉద్యోగాలపై ప్రభావం పడింది. దీనికి ఏ దేశం కూడా అతీతం కాదు. భారత్‌లో చైల్డ్ స్టంటింగ్ (చిన్నారుల్లో ఎదుగుదల లోపం) 38.7 శాతంగా ఉంది. వీరంతా భవిష్యత్తు తరానికి ప్రతీకలు. వారిలో 40 శాతం మంది ప్రపంచ డిజిటల్ ఆర్థిక రంగంలో పోటీ పడలేకున్నారు. పక్కనే ఉన్న చైనా మాత్రం చైల్డ్ స్టంటింగ్‌ను చాలా కనిష్ట స్థాయికి తగ్గించిందని కిమ్ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement