వైఎస్‌ రాజారెడ్డి హంతకుడి విడుదల | YS Raja Reddy Murder Case Accused Sudhakar Reddy Released | Sakshi
Sakshi News home page

వైఎస్‌ రాజారెడ్డి హంతకుడి విడుదల

Jun 11 2018 8:10 AM | Updated on Jun 11 2018 8:15 AM

YS Raja Reddy Murder Case Accused Sudhakar Reddy Released - Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌/సాక్షి, అమరావతి : దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తండ్రి వైఎస్‌ రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకర్‌రెడ్డిని క్షమాభిక్ష పేరిట రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తీసుకున్న నిర్ణయాన్ని ఆదివారం అమలు చేసింది. రాష్ట్రంలోని పలు జైళ్ల నుంచి మొత్తం 47 మంది ఖైదీలు విడుదలయ్యారు. రాజమహేంద్రవరం జైలు నుంచి 18 మందికి, విశాఖ నుంచి 13 మందికి, అనంతపురం నుంచి ఆరుగురు, వైఎస్సార్‌ జిల్లాలో ఏడుగురు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు ఖైదీలకు క్షమాభిక్ష లభించింది. వీరిలో కొందరు ఆదివారం విడుదల కాగా.. మరికొందరు సోమవారం విడుదల కానున్నారు.  

రాజకీయ ఒత్తిళ్లే కారణమా?
రాజకీయ ఒత్తిళ్ల వల్లే వైఎస్‌ రాజారెడ్డి హత్యకేసులో నిందితుడైన రాగిపిండి సుధాకర్‌రెడ్డిని విడుదల చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం వేల్పుల గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి 1998లో జరిగిన వైఎస్‌ రాజారెడ్డి హత్యకేసులో నిందితుడు. ఈ హత్యకేసులోని నిందితులందరికీ న్యాయస్థానం 2006లో జీవిత ఖైదు విధించింది. అప్పట్నుంచి నెల్లూరు జిల్లాలోని కారాగారంలో జైలు జీవితం గడుపుతున్న సుధాకర్‌రెడ్డిని విడుదల చేయాలంటూ టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement