పత్తి సాగులో నష్టం ఓ యువ రైతును బలి తీసుకుంది. గుంటూరు జిల్లా దుర్గి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దుర్గి (గుంటూరు) : పత్తి సాగులో నష్టం ఓ యువ రైతును బలి తీసుకుంది. గుంటూరు జిల్లా దుర్గి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన జడ శ్రీనివాస్(27) స్థానికంగా నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవటంతో పత్తి ఎర్రబారి, ఎదుగుదల లోపించింది. దీంతో దిగుబడి రాలేదు.
రూ. లక్ష వరకు ఉన్న అప్పును తీర్చే దారి కానరాక సోమవారం ఉదయం ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 3 గంటల సమయంలో మృతి చెందాడు. అతనికి భార్య నాగమణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.