ఎవరు.. విజేత | Who is the winner .. | Sakshi
Sakshi News home page

ఎవరు.. విజేత

May 16 2014 3:26 AM | Updated on Sep 2 2017 7:23 AM

రెండు వారాల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. సాధారణ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఓట్ల లెక్కింపు మొదలయ్యేందుకు కొన్ని గంటల సమయమే...

  • నేడు తేలనున్న ఫలితాలు
  •  హై టెన్షన్‌లో అభ్యర్థులు
  •  టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ప్రధాన పోరు
  •  సాక్షిప్రతినిధి, వరంగల్ : రెండు వారాల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. సాధారణ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఓట్ల లెక్కింపు మొదలయ్యేందుకు కొన్ని గంటల సమయమే ఉండడంతో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. నియోజకవర్గంలో తమకు వచ్చే ఓట్లు, ప్రత్యర్థులకు పోలయ్యే ఓట్లు ఎన్ని అని గంటకోసారి లెక్కలు వేసుకుంటున్నారు. ఒంటరిగా ఉంటే టెన్షన్ పెరుగుతుందనే ఆందోళనతో నిత్యం ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఇప్పటి వరకు కాలం వెళ్లదీశారు. కాగా, జిల్లాలో ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య పోటీ నెలకొంది.

    పాలకుర్తి,  ములుగు, నర్సంపేట, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉంది. మున్సిపల్ ఎన్నిల ఫలితాలను చూసుకుని కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ధీమాగా ఉంది. అదేవిధంగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాల లెక్కలతో టీఆర్‌ఎస్ కూడా ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు తమవేనని గట్టి నమ్మకంతో ఉంది.

    తెలంగాణలో తొలి ప్రభుత్వం తమదేనని చెబుతున్న టీఆర్‌ఎస్ నేతలు.. జిల్లాలోని 10 స్థానాలు తమ పార్టీ వారే గెలుస్తారని అంటున్నారు. కాంగ్రెస్ నేతలు సైతం తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్నారు. వీరి అంచనాలు, ప్రకటనలు తీరు శుక్రవారం తేలిపోనుంది.
         
    జనగామలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నుంచి ప్రధానంగా పోటీ సాగింది. మున్సిపల్ ఎన్నికలను బట్టి కాంగ్రెస్.. పరిషత్ ఎన్నికల ఫలితాల ఆధారంగా టీఆర్‌ఎస్ గెలుస్తుందని రెండు పార్టీల నేతలు ధీమాతో ఉన్నారు.
         
    మాజీ మంత్రులు బస్వరాజు సారయ్య, కొండా సురేఖ పోటీకి దిగిన వరంగల్ తూర్పు నియోజకవర్గం ఫలితంపైనే ఎక్కువ ఆసక్తి ఉంది. నరేంద్రమోడీ హవాతో గణనీయంగా విజయం వరిస్తుందని బీజేపీ అభ్యర్థి రావు పద్మ భావిస్తున్నారు.
         
    వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే డి.వినయభాస్కర్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎర్రబెల్లి స్వర్ణల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. బీజేపీ వర్గాలు సైతం విజయం తమదేననే ధీమాతో ఉన్నాయి.  
         
    నర్సంపేటలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్ధి పెద్ది సుదర్శన్‌రెడ్డిల మధ్య ప్రధానంగా పోటీ ఉంది.
         
    వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్, కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్, మహాజన సోషలిస్టు పార్టీ అభ్యర్థి మంద కృష్ణమాదిగల మధ్య పోటీ ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి టి.రాజయ్య, కాంగ్రెస్ అభ్యర్థి జి.విజయరామారావుల మధ్య పోటీ ఉంది.
         
    పాలకుర్తిలో పోటీ రసవత్తరంగా ఉంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి సుధాకర్‌రావు, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరావు, టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజయం తమదేనని ధీమాతో ఉన్నారు.
         
    ములుగు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సీతక్క, కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య, టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎ.చందులాల్ మధ్య ప్రధానంగా పోటీ ఉంది.
         
    పరకాల నియోజకవర్గంలోనూ త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్ నుంచి ఎం.సహోదర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇనుగాల వెంకటరామిరెడ్డి, టీడీపీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిల మధ్య ప్రధానంగా పోటీ ఉంది.
         
    భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా త్రిముఖ పోటీ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎస్.మధుసూదనాచారి, బీజేపీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు మధ్య పోరుతో ఇక్కడి ఫలితాలు ఆసక్తికరంగా ఉండనున్నాయి.
         
    మహబూబాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం.కవిత, టీఆర్‌ఎస్ నుంచి బానోత్ శంకర్‌నాయక్‌ల మధ్య పోటీ ప్రధానంగా ఉంది.
         
    డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డి.ఎస్.రెడ్యానాయక్, టీఆర్‌ఎస్ అభ్యర్థి సత్యవతి రాథోడ్‌ల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. వైఎస్సాఆర్‌సీపీ అభ్యర్థి సుజాతమంగీలాల్ ఇతర పార్టీల అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement