కష్టమైనా..నష్టమైనా అమలు చేస్తాం: యనమల | We will implement Farmer debt waiver: Yanamala Rama Krishnudu | Sakshi
Sakshi News home page

కష్టమైనా..నష్టమైనా అమలు చేస్తాం: యనమల

Jun 22 2014 2:27 PM | Updated on Jun 4 2019 5:04 PM

కష్టమైనా..నష్టమైనా అమలు చేస్తాం: యనమల - Sakshi

కష్టమైనా..నష్టమైనా అమలు చేస్తాం: యనమల

రైతు రుణమాఫీ కాస్త జాప్యం అయినా అందరికీ లబ్ధి చేకూరుస్తామని ఆర్ధికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

రైతు రుణమాఫీ కాస్త జాప్యం అయినా అందరికీ లబ్ధి చేకూరుస్తామని ఆర్ధికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రైతు రుణమాఫీపై అధ్యయనం కోసం నియమించిన కోటయ్య కమిటీ ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమైంది. కోటయ్య కమిటీతో భేటి అనంతరం యనమల మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీపై వివరాల సేకరణకు కొంత సమయం పడుతుందని కమిటీ కోరింది అని అన్నారు. 
 
ఆర్ బీఐ, బ్యాంకులు, ప్రభుత్వాధికారులను కలవాల్సిఉందని కోటయ్య కమిటీ చెప్పిందని, ప్రత్యామ్నాయాలు సూచించడానికి మరింత సమయం కావాలన్నారని యనమల తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీనుంచి వెనక్కిపోలేమని కమిటీకి చెప్పామని, కష్టమైనా, నష్టమైనా అమలు చేసే దిశగా వెళ్లాలని కమిటీకి సూచించామని యనమల అన్నారు. 
 
రుణమాఫీపై ఖచ్చితమైన నివేదిక ఇవ్వడానికి కమిటీ కసరత్తు చేస్తోందని, కమిటీ ప్రయత్యామ్నాయాలు రాగానే రుణమాఫీని అమలు చేస్తామన్నారు. త్వరలోనే నివేదిక ఇస్తామని చెప్పారని, వివిధ కోణాల్లో రుణాలపై విశ్లేషణ చేస్తున్నారని, ఎక్కువమందికి లబ్ధిచేకూర్చే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాలన్నది మా ఆలోచన అని యనమల మీడియాకు వెల్లడించారు. 
 
మధ్యంతర నివేదిక కోసమే సమయం కోరారని,  ఖరీఫ్‌ రుణాలు రీషెడ్యూల్‌ చేయాలని కేంద్రాన్నికోరుతున్నామని,  రుణాల రీషెడ్యూల్‌ కోసం బ్యాంకర్లు, ఆర్ బీఐని కోరుతున్నామని,  రుణాల రీషెడ్యూల్‌ కోసం కారణాలను ఇప్పటికే చెప్పామని యనమల అన్నారు. 
 
రుణాల రీషెడ్యూల్‌ చేస్తే రుణాల మంజూరుకు ఇబ్బంది ఉండదని అనుకుంటున్నామని, ఖరీఫ్‌ రుణాల మంజూరుకు బ్యాంకర్లు సహకరించాలని కోరుతున్నామన్నారు.  రుణాల చెల్లింపుల కోసం పట్టుబట్టవద్దని బ్యాంకర్లను కోరామని, ఈనెల 26, 27న సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారని, ప్రధానిని కలిసి.. సమస్యలను నివేదిస్తామని మీడియాతో  యనమల అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement