ఉద్యమానికి తోడుంటాం | we support united andhra pradesh movement | Sakshi
Sakshi News home page

ఉద్యమానికి తోడుంటాం

Aug 17 2013 2:23 AM | Updated on May 29 2018 4:06 PM

‘‘సమైక్యాంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు సమైక్యవాదులు వెనుకడుగు వేయకూడదు. మీ ఉద్యమానికి మేము తోడుంటాం’’ అని వైఎస్సార్‌సీపీ అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సర్వజనాస్పత్రి ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు శుక్రవారం ఆయన మద్దతు తెలిపారు


 అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ :  ‘‘సమైక్యాంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు సమైక్యవాదులు వెనుకడుగు వేయకూడదు. మీ ఉద్యమానికి మేము తోడుంటాం’’ అని వైఎస్సార్‌సీపీ అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సర్వజనాస్పత్రి ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు శుక్రవారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విభజన చేస్తే దేవుడు కూడా క్షమించడన్నారు.
 
 సీమాంధ్ర కాంగ్రెస్ పాలకులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కొందరు రాజీనామాలు చేస్తే.. మరికొందరు ఇంకా ఎవరైనా చేస్తారా అని ఎదురు చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతోందన్నారు. ప్రధానంగా ‘అనంత’లో ఉద్యమం ఆజ్యం పోసుకుందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతం వారు పోరాడినప్పుడు సీమాంధ్ర పాలకులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. జిల్లా మంత్రులు సైతం సమైక్యతపై ఏమాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమైక్యవాదులు తననెక్కడ నిలదీస్తారోనని మంత్రి రఘువీరారెడ్డి రహస్యంగా స్వాతంత్య్ర వేడుకలు ముగించుకుని వెళ్లారన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలోకి వైద్య విభాగం ఉద్యోగులు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలను బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడాన్ని ఎమ్మెల్యే ప్రశంసించారు. రోగులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. ఉద్యమం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నారు. ఉద్యమం సమైక్య ప్రకటనతోనే ముగిసిపోవాలన్నారు.
 
 అగ్ని గుండంలా మార్చారు
 రాజకీయ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చారని వైద్య, ఆరోగ్య జేఏసీ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పట్టించుకోకున్నా పర్వాలేదని, కుటుంబంలో చిచ్చు పెట్టి హాస్యం చూడడం తగదన్నారు. ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకోకముందే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామన్న ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఉద్యమ సెగలకు పాలకులు మాడిమసై పోతారన్నారు. రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాధారాణి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రాన్ని ప్రకటించే వరకు ఉద్యమం ఆగదన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రం అతలాకుతలంగా మారిందన్నారు.
 
 అంతకు ముందు ఓపీ బ్లాక్ ముందు గంటసేపు వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ శ్రీధర్, నాయకులు డాక్టర్ జగన్‌మోహన్‌రెడ్డి, డాక్టర్ వీరభద్రయ్య, డాక్టర్ కన్నేగంటి భాస్కర్, డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ ప్రవీణ్ దీన్ కుమార్, డాక్టర్ భీమసేనాచార్, ఆర్‌ఎంఓ వైవీ రావు, డాక్టర్ శ్రీనివాస్ శౌరి, డాక్టర్ శారద, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి ఎస్తేర్, మంజుల, అతావుల్లా, బాబా, మారుతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement