ఫ్యాక్షన్కు పుట్టినిల్లయిన తాడిపత్రి వేదికగా జిల్లాలో రాజకీయ చదరంగానికి తెరలేచింది. ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్రెడ్డి కుటుంబానికి పార్టీ తీర్థం ఇవ్వాలని నిర్ణయించడం ఆ పార్టీలో కలకలం రేపింది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఫ్యాక్షన్కు పుట్టినిల్లయిన తాడిపత్రి వేదికగా జిల్లాలో రాజకీయ చదరంగానికి తెరలేచింది. ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్రెడ్డి కుటుంబానికి పార్టీ తీర్థం ఇవ్వాలని నిర్ణయించడం ఆ పార్టీలో కలకలం రేపింది. జేసీ బ్రదర్స్కు పార్టీ తీర్థం ఇస్తే టీడీపీని వీడటానికి కూడా వెనుకాడబోమని ఎమ్మెల్యే పరిటాల సునీత, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు, తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పేరం నాగిరెడ్డి అల్టిమేటం జారీ చేశారు. ఆ అల్టిమేటంను కూడా చంద్రబాబు లెక్క చేయకుండా జేసీ బ్రదర్స్ వద్దకు సీఎం రమేష్ను రాయబారం పంపడటంపై పేరం నాగిరెడ్డి మనస్థాపం చెందారు.
తాడిపత్రిలో బుధవారం టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించిన పేరం నాగిరెడ్డి.. శ్రేణుల సూచన మేరకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పులివెందులలో వైఎస్సార్పీపీలో చేరారు. జేసీ బ్రదర్స్కు వ్యతిరేకంగా గళం విప్పిన పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు స్పందనపై టీడీపీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్రెడ్డి 2009 నుంచి ఆ పార్టీలో ఏకాకిగా మిగిలిపోయారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. దీనిపై ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్ తీవ్రంగా స్పందించారు. దిగ్విజయ్ ఆదేశాల మేరకు జేసీ దివాకర్రెడ్డికి పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్లో ఇమడలేని పరిస్థితులు ఏర్పడటంతో చాలా కాలంగా జేసీ బ్రదర్స్ ‘వలస’వాదం విన్పిస్తున్నారు.
ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ను ఆర్నెల్ల క్రితమే జేసీ బ్రదర్స్ చంద్రబాబు వద్దకు రాయబారం పంపారు. జేసీ బ్రదర్స్ను టీడీపీలో చేర్చుకోవడానికి అప్పట్లో చంద్రబాబు ప్రాథమికంగా అంగీకరించారు. చంద్రబాబు సూచన మేరకే ఆయన కుమారుడు లోకేష్ పలు మార్లు హైదరాబాద్లోని జేసీ దివాకర్రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరపడం ఆ పార్టీలో కలకలం రేపింది. జేసీ బ్రదర్స్కు టీడీపీ తీర్థం ఇవ్వడం ఖాయమనే అంచనాకు వచ్చిన తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పేరం నాగిరెడ్డి.. ఇదే అంశంపై అప్పట్లో చంద్రబాబును నిలదీశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. జేసీ బ్రదర్స్ను పార్టీలోకి తీసుకోవడం లేదని చెప్పినట్లు పేరం నాగిరెడ్డి అప్పట్లో ప్రకటించారు. తాడిపత్రిలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ సభలో సీనియర్ ఎమ్మెల్యే పరిటాల సునీత, పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు, పేరం నాగిరెడ్డి, కందిగోపుల మురళి తదితర నేతలు జేసీ బ్రదర్స్పై నిప్పులు చెరిగారు. టీడీపీ కార్యకర్తలను చంపి.. హత్యా రాజకీయాలు చేసిన జేసీ బ్రదర్స్కు పార్టీ తీర్థం ఇస్తే పార్టీని వీడటానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. సీనియర్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చంద్రబాబు అప్పట్లో వెనక్కి తగ్గారు. కానీ, ఇటీవల జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాల్లో జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలతో మరోసారి జేసీ బ్రదర్స్కు పార్టీ తీర్థం ఇచ్చే అంశంపై చంద్రబాబు చర్చించారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మినహా తక్కిన ప్రజాప్రతినిధులు, నేతలు జేసీ బ్రదర్స్ను పార్టీలో చేర్చుకోవద్దంటూ సూచించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో పార్టీ నేతలకు నచ్చజెప్పే బాధ్యతను రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి అప్పగించారు. ఆర్థిక వనరుల సమీకరణ కోసం జేసీ బ్రదర్స్ను పార్టీలోకి చేర్చుకోక తప్పని పరిస్థితి నెలకొందని.. అభ్యంతరం చెప్పవద్దని టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు సీఎం రమేష్, సోమిరెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ.. ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, కందికుంట ప్రసాద్, అబ్దుల్ ఘనీ, ఎంపీ నిమ్మల కిష్టప్ప తీవ్రంగా వ్యతిరేకించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జిల్లా టీడీపీ శ్రేణుల అభిప్రాయంతో నిమిత్తం లేకుండా జేసీ బ్రదర్స్కు పార్టీ తీర్థం ఇవ్వడానికే చంద్రబాబు మొగ్గుచూపుతుండటంతో పేరం నాగిరెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకు టీడీపీకీ గుడ్బై చెప్పారు. జిల్లాలో జేసీ దివాకర్రెడ్డి కుటుంబానికి.. పరిటాల రవి కుటుంబానికి రెండు దశాబ్దాలుగా ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. జేసీ బ్రదర్స్కు టీడీపీ తీర్థం ఇస్తే పరిటాల రవి వర్గం ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ఆది నుంచి జేసీ బ్రదర్స్ను వ్యతిరేకిస్తోన్న మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది.