26 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

Transfer of 26 IPS officers - Sakshi

తొమ్మిది జిల్లాలకు కొత్త ఎస్పీలు 

కర్నూలు, ఏలూరు రేంజ్‌ డీఐజీల మార్పు 

సీఎం వైఎస్‌ జగన్‌ను కలసిన డీజీపీ సవాంగ్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 26 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొమ్మిది జిల్లాలకు కొత్త ఎస్పీలను నియ మించారు. ముగ్గురు డీఐజీలు, ఒక జాయింట్‌ సీపీ, ముగ్గురు డీసీపీలు, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, ఎస్‌ఐబీ, సీఐడీ ఎస్పీలను కూడా బదిలీ చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో  శాంతి భద్రతల సమన్వయం పేరుతో ప్రత్యేకంగా పోస్టు సృష్టించి నియమించిన ఘట్టమనేని శ్రీనివాస్‌ను అనంతపురం పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (పీటీసీ)కి బదిలీ చేశారు. 

సీఎం నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం
డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో రెండు దఫాలు భేటీ అయ్యారు. ఎస్పీలు, నగర పోలీస్‌ కమిషనర్‌ల బదిలీలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. పలువురు ఐపీఎస్‌ల పనితీరుపై డీజీపీ సవాంగ్‌ ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాస ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ సవాంగ్‌ పరిశీలించారు. ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసు శాఖ ఆ ప్రాంతంలో నిఘాను పెంచింది. సీఎం నివాసం వద్ద కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను అనుసంధానించారు. బాంబు డిస్పోజల్, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top