కోడలికి టీడీపీ నేత వేధింపులు | TDP leader harassment to his Daughter in Law | Sakshi
Sakshi News home page

కోడలికి టీడీపీ నేత వేధింపులు

Jun 5 2018 3:28 AM | Updated on Aug 10 2018 9:52 PM

TDP leader harassment to his Daughter in Law - Sakshi

బాధితురాలితో తండ్రి గురుస్వామి

సాక్షి, గుంటూరు: అదనపు కట్నం కోసం కోడలిని వేధంచడమే కాకుండా ఆ కేసులో రాజీకి రావాలంటూ టీడీపీ మహిళా నేత కుటుంబం బెదిరింపులకు దిగుతోంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్‌ కో ఆప్షన్‌ మెంబర్, టీడీపీ నేత గుంజ చంద్రవతి నుంచి, ఆమె కుటుంబం నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ బాధితురాలి తండ్రి బత్తుల గురుస్వామి రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగు చూసింది. రూరల్‌ ఎస్పీ కార్యాలయంలో సోమవారం  ఎస్పీకు ఫిర్యాదు చేసిన గురుస్వామి అనంతరం విలేకరులతో మాట్లాడారు. పిడుగురాళ్లలో నివసిస్తున్న తనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారని చెప్పారు. 2012లో పెద్దమ్మాయిని తన అక్క అయిన కో ఆప్షన్‌ మెంబర్‌ గుంజ చంద్రవతి పెద్ద కుమారుడు అప్పారావుకు ఇచ్చి పెళ్లి చేశామన్నారు.

తర్వాత కొద్ది రోజుల నుంచే అదనపు కట్నం తన కూతురిని వేధిస్తున్నాడని చెప్పారు. పిడుగురాళ్ల పోలీసు స్టేషన్‌లో గతేడాది కేసు పెట్టామని అప్పటి నుంచి కేసులో రాజీకి రావాలని, లేకుంటే మీ అందరినీ చంపేస్తామని అల్లుడు, అతని మేనల్లుళ్లు ఇంటి మీదకు వచ్చి గొడవకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చి 26న తన ఇంటిపై అల్లుడు, అతని స్నేహితులు 17 మంది దాడి చేసి తన కుమార్తెల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్నారు.

వారిపై ఫిర్యాదు చేయగా పోలీసులు 14 మందిపైనే కేసు నమోదు చేసి ముగ్గురిని తప్పించారని ఆరోపించారు.  కేసులో రాజీకి రాకపోవడంతో బంధువులతో అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని, తన అత్త టీడీపీ కోఆప్షన్‌ మెంబర్‌ కావడంతో పోలీసులు వారికే వత్తాసు పలుకుతున్నారని బాధితురాలు సరిత వాపోయారు.  టీడీపీ ఎమ్మెల్యే ఒత్తిళ్లతో తన తండ్రితో సంతకం చేయించి చార్జిషీటు నుంచి పేర్లు తొలగిస్తూ పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement