లెక్క తప్పించారా?

TDP Government Corruption in Housing Scheme - Sakshi

ప్రభుత్వ ఆదేశాలపై గత ప్రభుత్వ గృహ లబ్ధిదారుల అర్హత పరిశీలన మమ అనిపించిన అధికారులుజిల్లాలో 34,382 గృహాల మంజూరు, నిర్మాణాలు సక్రమమేనట! వీటికి రూ.105.9 కోట్ల బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక అనర్హమైనవిగా తేల్చిన గృహాలు 1,454    గత ప్రభుత్వంలోనే వెలుగులోకి అక్రమాలు గృహనిర్మాణశాఖ నివేదికలపై అనుమానాలు గత టీడీపీ పాలనలో మంజూరు చేసిన పక్కాగృహాల లబ్ధిదారుల అర్హతపై పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. పరిశీలనలో అధికారులు తేల్చిన నిజాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.ప్రధానంగా గత ప్రభుత్వంలో 2018 నవంబర్‌లో మంజూరైన ఇళ్లల్లో 2,270 ఇళ్లను పరిశీలిస్తేఅందులో 1,308 నిర్మాణస్థాయి, ఫొటోల్లోతేడాలున్నట్టు గుర్తించారు. 962 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే సక్రమంగా ఉన్నాయని నిర్ధారించారు. ప్రస్తుతం అధికారులు పరిశీలించిన 35,836 ఇళ్లల్లో 1,454 గృహాలు అనర్హులకు కేటాయించారని తేల్చారు. మిగిలినవన్నీ అర్హులకే కేటాయించారని బిల్లులు చెల్లించాలని నివేదించడంపైఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బి.కొత్తకోట: ప్రభుత్వ చర్యల నుంచి తప్పించుకునేందుకు ఇళ్ల కేటాయింపులో అక్రమాలను అధికారులు తక్కువ చేసి చూపారని తెలుస్తోంది. దీనికోసమే అనర్హత లెక్క మొక్కుబడిగా వేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో జిల్లాకు 55,351 ఇళ్లను మంజూరు చేయగా వాటిలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఎన్నికల ముందు నుంచి బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిల్లుల విషయంలో లబ్ధిదారులు నిజమైన అర్హులా.. కాదా తేల్చాలని ఆదేశించింది. ఇందులో జిల్లాకు సంబంధించి 35,836 ఇళ్లకు బిల్లులు చెల్లించాల్సి ఉండగా.. వీటిని పరిశీలించి అర్హులను తేల్చాలని ప్రభుత్వం ఆదేశిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మేరకు వలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్‌ ఏఈలు భాగమై చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో అనర్హులకు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఇళ్లను పంచిపెట్టారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం పరిశీలనలో వెల్లడిస్తే తమకు ఇబ్బందులు తప్పవని అధికారులు లెక్క తక్కువగా చూపించారని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా అనర్హులకు ఇచ్చినవి 1,454 గృçహాలు మాత్రమే అని తేల్చారు. అందులోఅతి తక్కువగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో9, జీడీ నెల్లూరులో 20,కుప్పంలో 36 గృహాలు అనర్హులకు ఇచ్చారని గుర్తించారు. అనర్హులు పోగా మిగిలిన లబ్ధిదారులకు రూ.105.9కోట్ల బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి నివేదించారు.

పంచుకున్నారు
గత ప్రభుత్వంలో పక్కా గృహాలను టీడీపీ గ్రామ, మండల స్థాయి నాయకులు, జన్మభూమి కమిటీలు, కార్యకర్తలు పంచుకున్నారు. ఒక్క గృహ నిర్మాణానికి రూ.1.50 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం మూడు విడతల్లో ఇళ్లు మంజూరు చేసింది. 2016–17లో తొలి ఇళ్ల కేటాయింపులో టీడీపీ శ్రేణులకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. రెండో విడతలోనూ ఇదే పరిస్థితి ఉండగా మూడో విడతలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇళ్లను కేటాయించింది. ఇళ్ల నిర్మాణాల్లో వాస్తవ ప్రమాణాలు పాటించకపోగా అనర్హులకు ఇచ్చిన కారణంగా పెద్దపెద్ద భవంతులు నిర్మించుకున్నారు. సాధారణ లబ్ధిదారులు రూ.లక్షన్నరతో కూడుబెట్టుకున్న కొద్దిపాటు సొమ్ముతో జీవించగలిగేలా ఇళ్లను నిర్మించుకుంటే అనర్హులు ఖరీదైనా విశాలమైన భవనాలు నిర్మించారు. ఇవికూడా అర్హుల జాబితాలో చేరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

చర్యలకు భయపడే
గృహాల కేటాయింపులో అనర్హులు అధిక సంఖ్యలో ఉన్నట్టు నిర్ధారించి నివేదిస్తే అందుకు అప్పట్లో పనిచేసిన అధికారులకు చిక్కులొస్తాయని, అలాగే అప్‌లోడ్‌ చేసిన బిల్లులు మంజూరు కాకుంటే ఇబ్బందులు తప్పవని భావించి లెక్క తక్కువ చేశారన్న అనుమానాలు ఉన్నాయి. పరిశీలన ప్రారంభమైన సెప్టెంబర్‌ 11 నుంచి 23వ తేదీ వరకు ఒక్క అనర్హుడు లేరని నివేదించగా దీనిపై ‘ఏరివేతలో మాయ’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైన తర్వాత నివేదిక పంపే నాటికి అనర్హులు జాబితా 1,454కు ఎలా చేరిందో అధికారులకే తెలియాలి.

టీడీపీ హయాంలోనే తేల్చారు  
గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాలపై 2018 నవంబర్‌లో ఉన్నతస్థాయి అధికారులు జిల్లాలో 2,270 ఇళ్లకు బిల్లు మంజూరుకోసం అప్‌లోడ్‌ చేసిన ఫొటోలను పరిశీలిస్తే 962 గృహాలు మాత్రమే సక్రమంగా ఉన్నట్టు తేల్చారు. మిగిలినవ్నీ నిర్మాణ స్థాయికి మించి బిల్లులు అప్‌లోడ్‌ చేయడం, నిబంధనలు పాటించ లేదని నిర్ధారించారు. ఇందులో మాజీ సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం మండలంలో 49 ఇళ్లను పరిశీలిస్తే ఒక్కటీ సక్రమంగా లేదు. పూతలపట్టు మండలంలో 22 ఇళ్లు, పాలసముద్రం మండలంలో 14, చిన్నగొట్టిగల్లు మండలంలో 14, యర్రావారిపాళ్యం మండలంలో 27 గృహ నిర్మాణాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మాణ బిల్లు మంజూరు స్థాయిలో లేదని నిర్ధారించారు. తిరుపతిలో 32 గృహాలకు 7, చిత్తూరులో 115 గృహాలకు 31, మదనపల్లెలో 59 గృహాలకు 28, పుంగనూరులో 84 గృçహాలకు 66, శ్రీకాళహస్తిలో 83 గృహాలకు 8, నగరిలో 80 గృహాలకు 63, పలమనేరులో 27 గృహాలకు 14, పుత్తూరులో 79 గృహాలకు 50 గృహాలు మాత్రమే సక్రమంగా ఉన్నట్టు నిర్ధారించారు. మిగిలిన గృçహాలకు సంబంధించిన తప్పులను గుర్తించారు. గత ప్రభుత్వంలోనే అక్రమాలు జరినట్టు నిర్ధారణ జరిగితే ప్రస్తుత పరిశీలనలో అక్రమాల లెక్కను తక్కువ చేసి చూపడం తీవ్ర చర్చనీయాంశమైంది.

పరిశీలనలో తేలిందిదే
ప్రభుత్వం ఆదేశాల ప్రకారం గత ప్రభుత్వంలో మంజూరై, బిల్లులు  చెల్లించాల్సిన గృహాలపై నిర్వహించిన పరిశీలనలో తేలిన వాస్తవాలనే నివేదించారు. అర్హతలేని వారికి 1,454 గృహాలు మంజూరు చేసినట్టు తేలింది. ఈ మేరకే ప్రభుత్వానికి నివేదించి మిగిలిన ఇళ్లకు రూ.105కోట్ల బిల్లులు చెల్లించాలని ప్రతిపాదించాం.  – నగేష్,ఇన్‌చార్జ్‌ పీడీ, చిత్తూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top