బాబోయ్ బెట్టింగ్.. | start T20 World Cup beting | Sakshi
Sakshi News home page

బాబోయ్ బెట్టింగ్..

Mar 17 2016 3:32 AM | Updated on Sep 3 2017 7:54 PM

బాబోయ్ బెట్టింగ్..

బాబోయ్ బెట్టింగ్..

కొంతకాలంగా టీ20 క్రికెట్ మ్యాచ్‌లకు అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.

మొదలైన టీ20 ప్రపంచకప్
చక్రం తిప్పుతున్న బుకీలు
యువతను లక్ష్యంగా చేసుకున్న వైనం
బుకీల దూకుడుకు పోలీసులు కళ్లెం వేసేనా..?

 
 టీ20 ప్రపంచకప్ పోటీలు ప్రారంభమయ్యాయి. దీంతో పాటుగా జీవితాలు నాశనం చేసే బెట్టింగ్ కూడా పురివిప్పింది. బెట్టింగ్ కారణంగా ఇల్లు గుల్లయినా, అప్పులుపాలైపోయినా కొందరు అదేం పట్టించుకోకుండా పోయిన చోటే వెతుక్కోవాలనే సామెతను అనుసరిస్తూ మళ్లీ ఆ ఊబిలోకి దిగేస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన పోటీలు ఏప్రిల్ 3వ తేదీ వరకు జరగనున్నాయి.

మొన్నటి వరకు నగరాలకే పరిమితమైన బెట్టింగ్ స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని పల్లెలకు పాకేసింది. బుకీలు ఈనెల మొదటి నుంచే బెట్టింగ్‌లు కాసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రపంచకప్ పోటీలు ముగిసేనాటికి ఎందరి బతుకులు తలకిందులవుతాయో? ఎన్ని  కోట్ల రూపాయలు చేతులు మారుతాయో అన్న ప్రశ్న అందరిలో చర్చనీయాంశంగా మారింది.

 
 నెల్లూరు(క్రైమ్) : కొంతకాలంగా టీ20 క్రికెట్ మ్యాచ్‌లకు అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. గతంలో ఇరుదేశాల మధ్య వన్డే మ్యాచ్ అంటే సుమారు 10 గం టల పాటు టీవీల వద్ద కూర్చొని ఫలితాల కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. టీ20 మ్యాచ్‌లతో కేవలం రెండున్నర గంటల వ్యవధిలోనే జట్ల భవితవ్యం తేలిపోతోంది. దీంతో బెట్టింగ్ కాసేందుకు ఊత్సాహం చూపుతున్నారు.

 సంపన్నుల నుంచి.. రోజువారి కూలీవరకు..
గతంలో కేవలం వన్‌డే మ్యాచ్‌లు, ప్రపంచకప్ పోటీలపై మాత్రమే పందేలు కాసేవారు. టీ20 మ్యా చ్‌లు రావడంతో పరిస్థితి మారింది. స్మార్ట్‌ఫోన్ల కారణంగా ఎక్కడున్నా స్కోర్ల వివరాలు సులువుగా తెలుస్తుండటంతో పందెంరాయుళ్లు వ్యవహారాన్నంతా ఫోన్ల ద్వారానే జరిపిస్తున్నారు. సంపన్నవర్గాల కు చెందిన వారే కాకుండా మధ్యతరగతి, దినసరి కూ లీలు, ఆటోవాలాలు, హోటల్‌సర్వర్లుతో పాటు అనేకవర్గాల వారు పందేలకు అలవాటుపడి విలువైన జీవితాలను చిధ్రం చేసుకొంటున్నారు. రూ.లక్షల్లో పందేలు కడుతున్నారు. పందేల్లో సరస్వస్వం కోల్పోయినప్పటికి అప్పులు తెచ్చి మరీ ఫణంగా పెడుతూ నడిరోడ్లపై పడుతున్నారు. మరికొందరు అప్పులు తీర్చలేక ఆత్మహత్యాయత్నాలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంకొందరు ఊర్లు విడిచి పారిపోతున్నారు.

 యువతే లక్ష్యంగా.....
యువత, విద్యార్థులే లక్ష్యంగా క్రికెట్‌బుకీలు పావులు కదుపుతున్నారు.వారికి లేని పోని ఆశలు చూపి బెట్టింగ్‌వైపు ఆకర్షితులను చేస్తున్నారు. బెట్టింగ్‌లో నగదు కోల్పోయిన యువతే ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అంచనా.గతంలో జరిగిన పలు సం ఘటనలు ఊదాహరణగా నిలుస్తోన్నాయి.ఇది ఇలా ఉంటే ప్రపంచకప్ పోటీలు పదోతరగతి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.ఓవైపు పరీక్షలు, మరోవైపు ప్రాణప్రదమైన క్రికెట్ పోటీలు జరగుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
 
నెల్లూరు నగరానికి చెందిన కొందరు బుకీలుగా అవతారమెత్తారు. ఇతరప్రాంతాల్లో పాగావేసి జిల్లా వ్యాప్తంగా సబ్‌బుకీలను ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. గతంలో పోలీ సు అధికారులు విసృ్తతంగా దాడలు చేయడంతో కొంతమేర పందేలకు బ్రేక్‌పడింది. అయితే ఇటీవల తిరిగి ఊపందుకున్నాయి. ఒక్కో మ్యాచ్‌కు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల మేర బెట్టింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జోరుమీద ఉన్న బుకీల దూకుడు కు పోలీసులు ఏమాత్రం కళ్లెం వేస్తా రో వేచి చూడాల్సిందే.
 
 బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు..
 క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడేవారిపై చర్యలు తీసుకొంటాం. ఇప్పటికే మా వద్ద బుకీల సమాచారం ఉంది. వారిపై నిఘా ఉం చాం. ప్రజలు తమ ప్రాంతాల్లో బెట్టింగ్ నిర్వహిస్తే సమాచారం అందించాలి. వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం.  జి.వెంకటరాముడు, డీఎస్పీ

Advertisement
 
Advertisement
Advertisement