16,250 మందికి స్త్రీనిధి జీవనోపాధి రుణాలు

SRINIDHI LOANS TO 16,250 - Sakshi

జలుమూరు: స్వయం శక్తి సంఘాలు ఆర్థిక స్వావలంబన సాధించి ఆదాయం మరింత మెరుగుపరుచుకునేందుకు స్త్రీనిధి జీవనోపాధి రుణాలు మంజూరు చేస్తున్నామని స్త్రీ నిధి అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ అల్లు ఉమామహేశ్వరరావు తెలిపారు.

బుధవారం జలుమూరు ఐకేపీ కార్యాలయంలో స్త్రీ నిధి రుణాల రికార్డులు పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 16,250 మందికి ఒక్కొక్కరికి రూ.25 వేలు నుంచి రూ.లక్ష రుణం ఇస్తున్నామన్నారు. దీని కోసం రూ.62 కోట్లు కేటాయించామని చెప్పారు.

ఇప్పటి వరకూ 1600 మందికి రూ.7.50 కోట్లు ఇచ్చామన్నారు. సాధారణ రుణాలు 12 వేల మందికి రూ.24 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. స్త్రీనిధి జీవనోపాధుల పథకానికి సంబంధించి ఒక్కో పంచాయతీ నుంచి 25 మంది సభ్యులు నుంచి అధికంగా వారు రుణాలు తీసుకొనే అర్హత బట్టి కేటాయింపులు చేస్తున్నామని వివరించారు.

రుణాలు తిరిగి చెల్లిస్తే వారు కట్టిన మొత్తం వడ్డీలేని రుణంగా పరిగణించి తిరిగి రాయితీ మొత్తం వారి ఖాతాకే జమచేస్తామన్నారు. కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్‌ ఎస్‌.రాజ్‌కుమార్, స్త్రీనిధి మేనేజర్‌ నాగరాజు, సీసీలు ప్రభావతి, బుద్దమ్మ, బొడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top