
సాక్షి, గుంటూరు: జిల్లాలో శనివారం రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు సజీవదహనం కాగా మరొకరికి తీవ్రగాయలయ్యాయి. తాడేపల్లిలోని కొలనుకొండ హైవేపై ఈ ఘటన జరిగింది. గుంటూరు నుండి విజయవాడ వెళ్తున్న ఖాళీ పెట్రోల్ ట్యాంకర్.. కనిగిరి నుండి విజయవాడ వెళ్తూ రోడ్డు పక్క ఆగి ఉన్న కర్రల లోడ్ లారీని అతివేగంగా ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ స్పాట్లోనే చనిపోగా క్లీనర్కు తీవ్రగాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న హైవే పేట్రోలింగ్ సిబ్బంది.. గాయాలపాలైన క్లీనర్ను సమీప ఆస్పత్రికి తరలించారు. క్యాబిన్లో ఇరుకున్న డ్రైవరు మృతిదేహాన్ని వెలికితీస్తుండగా ట్యాంకర్ నుండి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేసరికి డ్రైవరు మృతదేహం పూర్తిగా కాలిపోయింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసి కాలిన మృతదేహాన్ని బయటకు తీసారు.
నల్గొండ జిల్లాలో
నల్గొండ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. చిట్యాల మండలం వెలిమినేడు హైవేపై ఈ ఘటన జరిగింది. ముందు వెళ్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో...అప్పటికే వేగంగా వెనుకనే వస్తున్న డీసీఎం అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన డీసీఎం డ్రైవర్ను సమీపంలోని జీఎమ్మార్ సిబ్బంది నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వర్షం కారణంగానే డీసీఎం అదుపుతప్పి ప్రమాదానికి గురైందని పోలీసులు చెబుతున్నారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా, వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.
కొత్తగూడెం జిల్లాలో
భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. భద్రాచలం డిపోకి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భధ్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.