
రావెలా.. గురివింద గింజలా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు వ్యవహారం గురివిందను తలపిస్తోంది.
గురివింద గురించి మనందరికీ తెలిసిందే. తన కింద నలుపు పెట్టుకుని పైనవున్న ఎరుపు రంగును చూసి మిడిసి పడుతుందట గురివింద గింజ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు వ్యవహారం గురివిందను తలపిస్తోంది. అధినేత మెప్పు పొందేందుకు ఈ టీడీపీ నేత చేస్తున్న విన్యాసాలు విమర్శలపాలవుతున్నాయి. తాజాగా అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి.
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమట. రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి వైఎస్ఆర్ సీపీయే కారణమట. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వైఎస్ఆర్ సీపీ ప్రయత్నిస్తోందట. వివిధ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి వైఎస్ఆర్ సీపీ ప్రయత్నిస్తోందట. మంత్రి రావెల కిషోర్ బాబు నోటి నుంచి అసెంబ్లీలో వెలువడిన ఆణిముత్యాలివి. రాజధానిపై చర్చకు అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీ సభ్యులు పట్టుబట్టడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు మంత్రిగారు ఈ వ్యాఖ్యలు చేశారు.
బహూశా రాష్ట్ర విభజనకు ముందు జరిగిన పరిణామాలను రావెల మర్చిపోయినట్టున్నారు. విభజనపై స్పష్టమైన వైఖరి చెప్పని పార్టీ టీడీపీ అని ఆయనకు గుర్తు లేనట్టుంది. విభజన జరగకముందే నూతన రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రకటించింది పచ్చబాబే నన్న సంగతి విస్మరించారా. రెండు కళ్ల సిద్ధాంతం వల్లించారేగానీ రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దని చెప్పారా. ఎంతసేపు అడ్డగోలు విభజనంటూ భజన చేసిన సైకిల్ పార్టీ నిర్మాణాత్మక సూచనలు ఎందుకు చేయలేదో చెప్పగలరా మంత్రిగారూ. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ అడ్డగోలు ఆరోపణలు సరికాదు.