20 శాతమంటే ఇదేనా బాబూ? | No 20% Farm loans waiver cleared by TDP government | Sakshi
Sakshi News home page

20 శాతమంటే ఇదేనా బాబూ?

Nov 22 2014 3:27 AM | Updated on Jul 12 2019 6:01 PM

తొలి సంతకం రుణ మాఫీపైనే అంటూ ఆర్భాటాలు పలి కిన తెలుగుదేశం సర్కారు దీనిపై ఆది నుంచీ పిల్లిమొగ్గలు వేస్తూనే ఉంది.

సాక్షి, హైదరాబాద్: తొలి సంతకం రుణ మాఫీపైనే అంటూ ఆర్భాటాలు పలి కిన తెలుగుదేశం సర్కారు దీనిపై ఆది నుంచీ పిల్లిమొగ్గలు వేస్తూనే ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళల 14వేల కోట్లు మినహాయించగా రైతాంగం తీసుకున్న వ్యవసాయ రుణాల విలువే 87వేల కోట్లు. ఇది రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) అధికారికంగా తేల్చిన లెక్క. దీనిలో ఇప్పటిదాకా పైసా కూడా బ్యాంకులకు చెల్లించకుండా వచ్చిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం... రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేస్తున్నామంటూ... దానికి తొలివిడతగా కేటాయించింది రూ.5వేల కోట్లు. దీంతోనే 20 శాతం రుణా లు మాఫీ చేస్తామని చెబుతోంది సర్కారు.
 
87 వేల కోట్లలో 20 శాతమంటే 17,400 కోట్లు కాదా! మరి 5వేల కోట్లు కేటాయించి 20 శాతం రుణాల్ని మాఫీ చేస్తున్నామంటే ఏమనుకోవాలి? పెపైచ్చు ఏడాదిలో రుణాలు తిరిగి చెల్లించలేదు కనక ఆ 87 వేల కోట్లపై 14 శాతం అపరాధ వడ్డీ చెల్లించాలి. అది రూ.12,180 కోట్లు. ఏడాదిన్నర దాటింది కనక అపరాధ వడ్డీ మరో 6,090 కోట్లూ జతపడుతోంది. అంటే ఇప్పటిదాకా చెల్లించాల్సిన వడ్డీయే కేవలం రూ.18,270 కోట్లవుతోంది. దీనికి అసలు మొత్తంలో 20 శాతం కలిపితే రూ.35,670 కోట్లు. కానీ చంద్రబాబు రూ.5వేల కోట్లు కేటాయించి 20 శాతం రుణాలు మాఫీ చేసేస్తున్నామని, మిగిలిన రుణాల్ని తరవాత మాఫీ చేస్తామని చెబుతున్నారు. ఈ మాటలు రైతులెలా నమ్ముతారు? ఇంతకంటే నమ్మకద్రోహం ఉంటుందా? రానురాను ఈ వడ్డీ పెరిగి రైతులకు పెనుభారం కాదా? ఇవన్నీ తీర్చకుండా కొత్త రుణాలు ఇవ్వబోమని బ్యాంకులు తేల్చి చెబుతున్న నేపథ్యంలో రైతుల పరిస్థితేంటి?

Advertisement
 
Advertisement
Advertisement