మరింత ‘మెట్రో’! | More 'Metro'! | Sakshi
Sakshi News home page

మరింత ‘మెట్రో’!

Oct 9 2014 1:23 AM | Updated on Sep 27 2018 3:58 PM

మరింత ‘మెట్రో’! - Sakshi

మరింత ‘మెట్రో’!

వైజాగ్ మెట్రో రైలు (వీఎంఆర్) ప్రాజెక్టు జోరందుకుంది. తొలుత పేర్కొన్నట్టు 25 కిలోమీటర్లకే పరిమితం కాకుండా పొడవు పెంపు తప్పనిసరని తెలుస్తోంది.

  • ఐటీ హబ్ నుంచి ఇండస్ట్రియల్ హబ్ వరకు...
  •  పారిశ్రామికవేత్తల ప్రతిపాదన
  •  15, 16 తేదీల్లో శ్రీధరన్ నగర పర్యటన
  •  మెట్రో డీపీఆర్ తయారీకి డీఎంఆర్‌సీకి అనుమతి
  • సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ మెట్రో రైలు (వీఎంఆర్) ప్రాజెక్టు జోరందుకుంది. తొలుత పేర్కొన్నట్టు 25 కిలోమీటర్లకే పరిమితం కాకుండా పొడవు పెంపు తప్పనిసరని తెలుస్తోంది. ఎక్కువ రాకపోకలు(రైడర్‌షిప్) ఆధారంగా కారిడార్ ఎంపికకు కసరత్తు మొదలయింది. ఇందులో భాగంగా విశాఖ, విజయవాడ, తిరుపతి మెట్రో ప్రాజెక్టులకు ప్రధాన సలహాదారుగా నియమితులైన ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) మాజీ అధ్యక్షుడు ఇ.శ్రీధరన్ ఈ నెల 15, 16 తేదీల్లో నగరంలో పర్యటించనున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా నగరంలో మెట్రో వ్యవస్థకు అనువైన కారిడార్లపై ఈయన ఓ నివేదికను సిద్ధం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన వివిధ పరిశ్రమల అధినేతలు ప్రత్యేక బృందంగా ఏర్పడి ట్రాక్ పొడవు పెంపుపై విన్నవించేందుకు సన్నద్ధమవుతున్నారు.
     
    ఐటీ హబ్ టు ఇండస్ట్రియల్ హబ్

    రాష్ట్ర విభజన తర్వాత పోర్టు సిటీ విశాఖలో పరిశ్రమలు, ఐటీ సంస్థలు, రియల్ బూమ్ పెరిగింది. గాజువాక నుంచి మధురవాడ వరకు భారీగా గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. మధురవాడ ఐటీ సెజ్‌లో మరిన్ని సంస్థలు రానున్నాయి. దీంతో తొలుత ప్రతిపాదించిన 25 కిలోమీటర్లతో సరిపెట్టుకోకుండా పొడవు పెంచేందుకు సర్వత్రా డిమాండ్ నెలకొంది. మధురవాడ నుంచి గాజువాక వరకు సుమారు 35 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్‌ను తొలి దశలో ఏర్పాటు చేయాల్సిందిగా నగరానికి చెందిన పారిశ్రామిక వేత్తలు సూచిస్తున్నారు. మరి కొందరు భవిష్యత్ అవసరాల దృష్ట్యా అనకాపల్లి వరకు విస్తరించాలని కోరుతున్నారు.
     
    జనాభా.. జనసాంద్రత అంచనాలు

    జీవీఎంసీలో అనకాపల్లి, భీమిలి విలీనానికి ముందున్న జనాభా, జన సాంద్రత ఆధారంగా మెట్రో ప్రాథమిక నివేదికలో వివరాల్ని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని మొత్తం ట్రాఫిక్ రద్దీలో 59 శాతం జీవీఎంసీ పరిధిలోనే నెలకొంది. దీని మేరకు మెట్రోరైలు ప్రాజెక్టుపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భీమిలి, అనకాపల్లి విలీనంపై సందిగ్ధం ఉన్నప్పటికీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.
     
    ఎంఆర్‌టీఎస్ స్థానంలో వీఎంఆర్

    విశాఖ సిటీ డెవలప్‌మెంట్ ప్లాన్ (సీడీపీ)లో భాగంగా గతంలోనే మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం(ఎంఆర్‌టీఎస్) పేరిట మూడు మెట్రో కారిడార్లను ప్రతిపాదించారు. కేంద్రం ప్రతిపాదించిన మెట్రో రైలు ప్రాజెక్టుతో ఎంఆర్‌టీఎస్ మరుగునపడింది. తొలి దశలో భాగంగా సుమారు 25 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు కారిడార్లకు ప్రాథమిక సర్వేలు చేశారు. వాహన రద్దీ, ప్రయాణికులు రాకపోకలు ఎక్కువగా ఉండే నాలుగు మార్గాలను సూచించారు.
     
    శ్రీధరన్ పర్యటనతో స్పష్టత

    జీవీఎంసీ ప్రతిపాదించిన నాలుగు రూట్లతోపాటు నగరమంతా శ్రీధరన్ పర్యటించనున్నారు. ట్రాఫిక్ రద్దీ, లో కార్బన్ మొబిలిటీ ఆధారంగా భవిష్యత్ పరిశ్రమల రాకపోకల్ని అంచనా వేసి కారిడార్ మార్గాన్ని నిర్ణయిస్తారు. జీవీఎంసీ ప్రతిపాదిత రూట్లే కాకుండా ప్రత్యామ్నాయ రూట్లను కూడా సందర్శించనున్నారు. కారిడార్లో సాధ్యమైనంత వరకు ప్రయివేటు స్థలాలు/నిర్మాణాలు తక్కువ సేకరించేలానే నిర్ణయించనున్నట్టు తెలిసింది. దీని ఆధారంగానే మెట్రో రైలు ప్రాజెక్టు వ్యయంపై కూడా అంచనాకు రానున్నారు.
     
    ఉద్యోగులు, కార్మికులే కీలకం

    నగర పరిధిలో రోజువారీ రాకపోకలు సాగిస్తున్న ఉద్యోగులు, కార్మికులే మెట్రో రైలు మార్గాన్ని శాసించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా అందరి దృష్టీ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులపైనే ఉంది. సుమారు 19 వేల మంది ఉన్న స్టీల్ సిబ్బందిలో ఎక్కువమంది గాజువాక, కూర్మన్నపాలెంతోపాటు నగర నడిబొడ్డునున్న హెచ్‌బీ కాలనీ లోని స్టీల్‌ప్లాంట్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఉన్నా రు. ఆటోనగర్‌లోని వివిధ సంస్థలు, సెజ్‌లోని పరి శ్రమల్లో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. వీరు కూడా నగరం నుంచే రోజూ రాకపోకలు చేస్తుంటారు. జీవీఎంసీ పరిధిలో వేసే మెట్రోరైలు రోజుకు కనీసం 3 లక్షల మంది ప్రయాణికుల్ని చేరవేసేలా మార్గం రూపొందించాల్సి ఉంది. దీంతో కారిడార్ నిర్ణయానికి దాదాపు స్టీల్‌ప్లాంట్, ఆటోనగర్‌లో పనిచేస్తున్న వారి రాకపోకలే కీలకం కానున్నాయి.
     
    డీపీఆర్ బాధ్యతలు డీఎంఆర్‌సీకి

    విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎంఆర్‌టీఎస్)పై ఫీజిబిలీటీ నివేదికతోపాటు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ బాధ్యతల్ని డీఎంఆర్‌సీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ, విజయవాడలో కన్సల్టెన్సీ సేవలకుగాను కిలోమీటర్‌కు రూ.8 లక్షలు చెల్లించనున్నారు. తిరుపతిలో కూడా తర్వాత మెట్రో రైలు ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి తొలి దశలో కేవలం ఫీజిబిలీటీ నివేదిక కోసం రూ.50 లక్షలు(సేవా పన్ను అదనం) చెల్లించనున్నారు.
     
     ప్రాథమిక ప్రతిపాదిత రూట్లు
     మద్దిలపాలెం జాతీయ రహదారి నుంచి ఎన్‌ఏడీ కూడలి (10 కి.మీ.)
     రైల్వే స్టేషన్ నుంచి సింథియా మీదుగా గాజువాక (14.73 కి.మీ.)
     తగరపువలస జాతీయ రహదారి నుంచి హనుమంతవాక (14 కి.మీ.)
     ఎన్‌ఏడీ కూడలి జాతీయ రహదారి నుంచి గాజువాక (8.5 కి.మీ.)
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement