
విజయవాడ : రవాణా రంగ సమస్యల పరిష్కారం కోసం ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా శనివారం కృష్ణా జిల్లాలో రెండో రోజు లారీల నిరవధిక సమ్మె కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా లారీలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో ఆటోనగర్, భవానీపురం, జిల్లాలో గుడివాడ, నందిగామ, ఇబ్రహీంపట్నం, నూజివీడు ప్రాంతాల్లో రవాణా వాహనాలు నిలిపివేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే లారీలు కూడా గమ్యస్థానాలకు చేరుకుని నిలిపివేశామని కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు కోనేరు రామారావు, ప్రధాన కార్యదర్శి అడుసుమిలి సదాశివరావు, ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావులు సంయుక్త ప్రకటనలో తెలిపారు. లారీ యజమానులు చేపట్టిన సమ్మెకు టాక్సీ, మినీట్రాన్స్పోర్టు, తదితర సంఘాలు కూడా సంఘీభావం ప్రకటించాయి. లారీ ఓనర్ల సమస్యలు పరిష్కరించకపోతే తాము కూడా బంద్లో పాల్గొంటామన్నారు.