లోకేషా... తమాషా! | let me be judged for my performance, says Nara Lokesh | Sakshi
Sakshi News home page

లోకేషా... తమాషా!

Jun 18 2014 5:48 PM | Updated on Aug 29 2018 3:37 PM

లోకేషా... తమాషా! - Sakshi

లోకేషా... తమాషా!

'పార్టీలో గాని, ప్రభుత్వంలోగాని ఎటువంటి పదవి ఆశించడం లేదు. ముందుగా నా పనితీరును అంచనా వేయండి'- ఇటీవల ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్య ఇది.

'పార్టీలో గాని, ప్రభుత్వంలోగాని ఎటువంటి పదవి ఆశించడం లేదు. ముందుగా నా పనితీరును అంచనా వేయండి'- ఇటీవల ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్య ఇది. లోకేష్ అస్పష్ట వైఖరికి ఈ వ్యాఖ్య అద్దం పడుతోంది. తన తండ్రి చంద్రబాబు నాయుడు బాటలోనే ఆయన పయనిస్తున్నట్టు కనబడుతోంది. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు చివరివరకు రెండు కళ్ల సిద్ధాంతం అవలంభిస్తూ వచ్చారు. విభజనకు అనుకూలమో, వ్యతిరేకమో ఏదీ తేల్చి చెప్పకుండా ప్రజలను తికమక పెట్టారు. లోకేష్ కూడా తండ్రి దారిలోనే నడుస్తున్నట్టు కనబడుతోంది.

తన తండ్రితో కలిసి రాష్ట్ర విభజనలో లోకేష్ భాగస్వామి అయ్యారు. కాంగ్రెస్ తో చేతులు కలిపి రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో లోకేష్ తన వంతు పాత్ర పోషించారు. ఇందుకు ఎల్లోమీడియా కూడా సహకారం అందించింది. ఈ విషయాలపై లోకేష్ ఎందుకు మాట్లాడరు. తన కంటే సీనియర్ నాయకులు ఉండగా పార్టీ పదవులు చేపట్టేందుకు ఆయన ఎందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పెద్ద కొడుకు హోదాలో వారసత్వంగా పదవి కోరుకుంటున్నారా. పార్టీకి సేవలందించినందుకు మెచ్చి పీఠమెక్కిస్తారా. లోకేష్ కంటే ఎక్కువగా పార్టీకి సేవలందించిన వారికి ఆయనతో సమానంగా గౌరవం ఎందుకు దక్కలేదు. వారసత్వ రాజకీయాల గురించి ఇతర పార్టీలపై విరుచుకుపడే ఎల్లో మీడియా ఈ విషయంలో మౌనంగా ఎందుకుంది.

కుమారుడిని అందలం ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు పార్టీ కోసం అహోరాత్రులు పనిచేసిన ఆరు లక్షల మంది టీడీపీ కార్యకర్తలను ఏవిధంగా గౌరవిస్తారు. వారికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తారా. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఐవీఆర్ఎస్(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా ఎంపిక చంద్రబాబు తన సొంత కుమారుడికి పార్టీ పదవి అప్పగించే విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నారా. రాష్ట్రం కలిసుండాలా, వద్దా అనే దానిపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలను అభిప్రాయాలను చంద్రబాబు ఎందుకు తీసుకోలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే మార్గాల గురించి ఆయన పట్టించుకోలేదు. కాంగ్రెస్ నుంచి వలసవచ్చిన నాయకులకు స్వాగతం చెప్పడంపైనే దృష్టి పెట్టారు.

ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకోలేక తిట్టిన నోటితోనే నరేంద్ర మోడీని స్తుతించి బీజేపీతో జట్టు కట్టారు. ఈసారి అధికారంలోకి రాకపోతే ఇక రాజకీయ సన్యాసం తప్పదని భావించిన బాబు బీజేపీని బలవంతంగా దోస్తీకి ఒప్పించారు. చివరకు 1.9 ఓట్ల శాతంతో అధికారాన్ని దక్కించుకున్నారు. తండ్రీ, కొడుకుల అబద్దపు వాగ్దానాలను నమ్మి ప్రజలు టీడీపీకి ఓటు వేశారు. ఇదంతా తన కుమారుడి ఘనతే అన్నట్టుగా మీడియాలో ఎనలేని ప్రచారం కల్పించారు చంద్రబాబు. నిజంగా లోకేష్ సత్తా ఎంటో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎల్లోమీడియా అండతో నారా లోకేష్ ఆయన అనుచరగణం ఎన్ని కుతంత్రాలు చేసినా వారికి దక్కింది రెండు శాతం ఓట్ల విజయం మాత్రమే.

-వెంకట్ రాజు(అమెరికా)
ఈ వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. సాక్షి డాట్ కామ్ కు ఎటువంటి సంబంధం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement