గట్టెక్కేదెలా? | Leaders of the ruling Congress party in the next general election | Sakshi
Sakshi News home page

గట్టెక్కేదెలా?

Feb 9 2014 2:35 AM | Updated on Mar 18 2019 7:55 PM

ఓటమి భయంతో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకే జంకుతున్నారు.

సాక్షి, అనంతపురం : ఓటమి భయంతో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకే జంకుతున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నా కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకోవడంలో విఫలం కావడంతో జిల్లాలో విజయం సాధిస్తామనే ధీమా ఒక్కరిలోనూ లేదు. ఈ ఎన్నికల్లో గట్టెక్కేదెలా అని తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డికి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.
 
 దీంతో ఈసారి పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తన సన్నిహితుల వద్ద మంత్రి ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కళ్యాణదుర్గం నుంచి గెలుపొందినా నియోజకవర్గ ప్రజలకు సరిగా అందుబాటులో లేరనే అపవాదు మూటగట్టుకున్నారు. దీంతోపాటు రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ముందుకెళ్తున్నా సమైక్యంగా ఉంచాలని ఇప్పటివరకు పెద్దగా స్పందించిన పాపాన పోలేదు. కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ కేడర్ కూడా నిర్వీర్యం కావడంతో రానున్న ఎన్నికల్లో విజయం కష్టమని భావించి పెనుకొండపై దృష్టి కేంద్రీకరించారు. ఇదిలా ఉండగా అనంతపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో అనంతపురం నగరపాలక సంస్థ మాజీ మేయర్ రాగే పరశురాంను పోటీ చేయాలని ఆ పార్టీ ముఖ్య నేతలు ఒత్తిడి తెస్తున్నా ఆయన ససేమిరా అంటున్నట్లు తెలిసింది.
 
 ఏదో ఒక విధంగా పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా మునిగే పడవను తానెందుకు ఎక్కుతానంటూ పర శురాం తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో మేయర్‌గా ఎన్నికై పదవిని అనుభవించి.. ప్రస్తుతం పార్టీ గెలవదనే కారణంతో పోటీ చేసేందుకు వెనుకాడితే ఎలా అంటూ ఆయన్ను వారు ప్రశ్నించినట్లు తెలిసింది.
 
 జిల్లాలో ముఖ్యంగా రాప్తాడు, కదిరి, హిందూపురం, రాయదుర్గం, ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవరూ రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు ఇటీవల ఏఐసీసీ నుంచి ప్రతినిధి బృందం సభ్యులు వచ్చినా వారిని కలవడానికి ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఎవరూ ముందుకు రాకపోవడం విశేషం. సామాన్య కార్యకర్తలు మినహా గతంలో పదవులు పొందిన వారెవ్వరూ దరఖాస్తులు ఇవ్వకపోవడంతో ఆ పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు.
 
 హిందూపురం పార్లమెంటు స్థానానికి దరఖాస్తు ఇచ్చిన ఎమ్మెల్సీ తిప్పేస్వామి మినహా నియోజకవర్గాలకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించగా ఆ స్థాయి తగ్గ నాయకులెవ్వరూ లేరని ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలే బహిరంగంగా చెబుతున్నారు. గుంతకల్లు, తాడిపత్రి ఎమ్మెల్యేలతో పాటు శింగ నమల నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి శైలజానాథ్ సైతం ఈ దఫా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఇష్ట పడటం లేదు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement