ఉన్నత విద్యా ప్రాప్తిరస్తు

Jagananna Vasathi Deevena Launch Today - Sakshi

నేడు జగనన్న వసతి దీవెనకు శ్రీకారం

జిల్లాలో 1,05,709  మందికి లబ్ధి

తొలి విడతలో తల్లుల  ఖాతాల్లో రూ.99.26  కోట్లు జమ

మరో 3 వేల విద్యార్థుల దరఖాస్తుల పరిశీలన

సాక్షి, విశాఖపట్నం: జగనన్న వసతి దీవెన... నవరత్నాల్లో మరో హామీ! ఇప్పటికే పాఠశాల, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేసిన సంగతి తెలిసిందే. అదే రీతిలో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ తదితర ఉన్నత విద్యాకోర్సులు చదువుతున్నవారి కోసం ‘జగనన్న వసతిదీవెన’ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించే వారికి పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజన ఖర్చుల నిమిత్తం ఏడాదికి రూ.20 వేల చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమాన్ని సోమవారం విజయనగరంలో ప్రారంభిస్తున్నారు. అయితే ఉన్నత విద్యాకోర్సుల వారే కాకుండా ఐటీఐ, పాలిటెక్నిక్‌ కోర్సుల విద్యార్థులకు వర్తింపజేస్తున్నారు. విశాఖ జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా సోమవారం ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. తద్వారా జిల్లాలో 1,05,709 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వారి తల్లుల బ్యాంకు ఖాతాలో రూ.99.26 కోట్లు జమ కానుంది.

గ్రామం, వార్డు ఒక యూనిట్‌గా తీసుకొని అక్కడ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్తికర విధానంలో సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ నవశకం సర్వేను నిర్వహించిన సంగతి తెలిసిందే. రాజకీయ, వర్గ, కులమతాలకు అతీతంగా ఈ ప్రక్రియ సాగుతుందన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాల ప్రకారం జిల్లాలో ఆ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి లబి్ధదారుల గుర్తింపు ప్రక్రియలో ఇదొక భాగం. గతంలో ప్రభుత్వం వద్దఉన్న డేటాబేస్‌లో తప్పుల సవరణ, మార్పులు చేర్పులు, సంక్షేమ పథకాలకు అర్హుల గుర్తింపు, ఇప్పటివరకూ పథకంలో లేనివారి పేర్ల నమోదు వంటి పనులన్నీ చేశారు. విద్యా, వసతి దీవెన కార్యక్రమం కోసం జ్ఞానభూమి వెబ్‌సైట్‌లోని విద్యార్థుల వివరాలను సర్వేకు అనుసంధానించి ఫార్మెట్‌ ఇచ్చారు.

 ప్రత్యేకంగా కార్డు
ఇప్పటివరకూ రేషన్‌ సరుకులు తీసుకోవడానికే కాదు పింఛన్‌కు, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యానికి, విద్యార్థుల ఉపకార వేతనాలకు, యువతకు కార్పొరేషన్ల రుణాలు పొందడానికి రేషన్‌కార్డు ఒక్కటే ఆధారమవుతోంది.  అలాగాకుండా పథకానికొక కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. బియ్యం కార్డు, వైఎస్సార్‌ పింఛన్‌ కానుక కార్డు, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కార్డులతో పాటు జగనన్న విద్యాదీవెన/జగనన్న వసతి దీవెన కార్డు కూడా అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాలకు జగనన్న వసతి దీవెన కార్డులను చేరవేశారు. సోమవారం అధికారికంగా పంపిణీ ప్రారంభమవుతుంది. మంగళవారం నుంచి గ్రామ, వార్డు వలంటీర్లు లబి్ధదారుల ఇళ్లకు వెళ్లి ఈ కార్డును అందజేస్తారు. ఈ కార్డుతో పాటు ముఖ్యమంత్రి సందేశపత్రం కూడా అందిస్తారు. అంతేకాదు వసతి దీవెన నగదు అందినట్లు వారి నుంచి అకనాలెడ్జ్‌మెంట్‌ కూడా తీసుకుంటారు.

 1.05 లక్షల మందికి సాయం
జగనన్న విద్యాదీవెన పథకం కింద అర్హులైన విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. ఇక జగనన్న వసతిదీవెన పథకం విషయానికొస్తే ప్రతి విద్యారి్థకీ భోజనం, వసతి ఖర్చుల కోసం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏటా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ కోర్సును బట్టి అందించనుంది. ఏడాదిలో రెండు విడతలుగా ఆయా విద్యార్థుల తల్లి ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేస్తుంది. తొలి విడతలో 6,802 మంది ఐటీఐ విద్యార్థులకు రూ.5 వేల చొప్పున రూ.3.40 కోట్లు, అలాగే 12,179 మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.7,500 చొప్పున రూ.9.13 కోట్లు అందనున్నాయి. ఇక జిల్లాలో డిగ్రీ, ఆపై ఉన్నత విద్యాకోర్సులు చదివే 86,728 మంది విద్యార్థులకు రూ.10 వేల చొప్పున రూ.86.73 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.

అర్హతల సడలింపు
పలు సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వం పలు అర్హతలను సడలించింది. జగనన్న వసతి దీవెన కార్యక్రమానికీ గతంతో పోలిస్తే మార్పులు జరిగాయి. ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీలతో పాటు విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ బోర్డు గుర్తింపు ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి కలగనుంది.   

కుటుంబ వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు.  

పదెకరాల మాగాణి లేదా 25 ఎకరాల్లో మెట్ట భూమి ఉండవచ్చు. మాగాణి, మెట్ట భూమి కలిపి 25 ఎకరాలకు మించకూడదు.  

పారిశుద్ధ్య కారి్మకులు మినహా మరే ఒక్క కుటుంబసభ్యుడు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్‌ అయి ఉండకూడదు.  

టాక్సీ, ఆటో, ట్రాక్టరు వంటివి తప్ప మరే సొంత నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.  

కుటుంబంలో ఆదాయపన్ను చెల్లింపుదారులు ఉండకూడదు.  

పట్టణాల్లో 1500 చదరపు అడుగులకు మించి భవనం ఉండకూడదు.  

ఈ అర్హతల ప్రకారం సర్వేలో పరిశీలించిన తర్వాత అర్హులు, అనర్హుల జాబితాలను వేర్వేరుగా తయారుచేశారు. వాటిని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. 

చెప్పలేని ఆనందం  
మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి అభినయ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతోంది. అబ్బాయి సంకీర్త్‌ ఇటీవల ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటరీ్మడియట్‌ పూర్తి చేశాడు. వీరిద్దరి చదువుకు శక్తికి మించి ఖర్చులు చేశా. అబ్బాయి ప్రస్తుతం డైట్‌లో శిక్షణ పొందుతున్నాడు. జగనన్న వసతి దీవెన వర్తిస్తుందని ఇటీవల గ్రామ సచివాలయ ఉద్యోగి ఫోన్‌ చేసి చెప్పినప్పుడు చాలా ఆనందపడ్డా. సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి నిజంగా విద్యాభివృద్ధికి ఎనలేని ప్రోత్సాహం అందిస్తున్నారు. గత నెలలో అమ్మఒడి పేరుతో రూ.15వేలు అందించి, ఇప్పుడు వసతి దీవెన కింద ఏడాదిలో ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ ఆపై విద్యార్థులకు రూ.20వేలు వంతున ఆర్థికంగా ఆసరా కల్పిస్తున్నారన్నారు. పేద విద్యార్థులకు ఈ పథకం ఓ వరం.  
–జీరు గంగాభవాని, తగరపువలస 

నిజమైన దీవెన
మా అమ్మాయి నాగదేవి గతేడాది ఇంటర్‌ పూర్తి చేసింది. ఇంజినీరింగ్‌ చదువుతానని పట్టుబట్టింది. ఆర్థిక పరిస్థితి సహకరించక చదివించలేకపోయాను. బీఎస్సీలో జాయిన్‌ చేశాను. మాలాంటి వాళ్ల పిల్లలు కూడా నచ్చిన చదువులు చదివించే విధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం చాలా గొప్పది. జగనన్న వసతి దీవెనలో మా అమ్మాయికి రూ.20 వేలు వస్తాయని తెలిసింది. ఫీజులు, ఇతర ఖర్చులకు అవి సరిపోతాయి. ఇది మాలాంటి పేదలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన వరం. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ఆయన.    
– మారిశెట్టి సూర్యవతి, కొరుప్రోలు 

జగనన్న ఇచ్చిన వరం
మా అమ్మాయి సౌజన్య ఏజీ బీఎస్సీ హోమ్‌సైన్స్‌ నాలుగో ఏడాది చదువుతోంది. ‘జగనన్న వసతి దీవెన’తో మాలాంటి కుటుంబాలకు కొండంత అండ. మా పిల్లల చదువులు నిరాటంకంగా సాగుతాయి. ఫీజులకు, ఖర్చులకు కూడా కొంత వరకు ఈ నగదు ఉపయోగపడుతుంది. పేద విద్యార్థులకు ఈ పథకం ఓ వరం. సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు. 
– కొమ్మన లక్ష్మి 

చాలా గొప్పవిషయం  
జగనన్న వసతి దీవెన పథకం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చడం చాలా గొప్పవిషయం. విద్యార్థులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పథకాలు విద్యాభివృద్ధికి దోహదం చేస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వలన ఎంతో మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. ఇలాంటి పథకం ప్రవేశపెట్టిన సీఎం వైఎస్‌జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. 
– లక్ష్మి, గొలుగొండ 

భారం తగ్గించారు 
పెందుర్తిలోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. మాలాంటి పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక పరిస్థితులు అవరోధం కాకూడదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావించారు. పథకాలు ప్రవేశపెట్టారు. విద్యా దీవెన, వసతి దీవెనతో నా తల్లిదండ్రులకు నా చదువుభారం తీరినట్టే. థ్యాంక్స్‌ టు సీఎం సార్‌.  
– పి.రమణి, డిగ్రీ సెకెండ్‌ ఇయర్, దేవరాపల్లి

రుణపడి ఉంటాం 
నేను ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో మొదటి సంవత్సరంÆ చదువుతున్నాను. నాన్న నరసింగరావు లేబర్‌ పనిచేస్తూ నన్ను కష్టపడి చదివిస్తున్నారు. అమ్మ కనకమహాలక్ష్మి గృహిణి. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు మాలాంటి వారికి చాలా మేలు చేస్తాయి. మా తల్లిదండ్రుల మీద భారాన్ని తగ్గిస్తాయి. మా చదువుకు అండగా నిలుస్తున్న సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం. 
– గండ్రెడ్డి తరుణ్‌కుమార్, నరవ గ్రామం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top