మెట్రో పరుగులు మూడేళ్లలో | In three years metro rail | Sakshi
Sakshi News home page

మెట్రో పరుగులు మూడేళ్లలో

Jun 18 2015 4:10 AM | Updated on Oct 16 2018 5:04 PM

మెట్రో పరుగులు మూడేళ్లలో - Sakshi

మెట్రో పరుగులు మూడేళ్లలో

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) నివేదించిన సవివర నివేదికకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది...

- డీఎంఆర్‌సీ డీపీఆర్‌ను ఆమోదించిన కేబినెట్
- రెండో దశలో అమరావతికి అనుసంధానం
- ప్రకాశం బ్యారేజీ దిగువన మరో బ్రిడ్జి నిర్మాణం
సాక్షి, విజయవాడ బ్యూరో :
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) నివేదించిన సవివర నివేదికకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించిన మీదట ఈ నిర్ణయం తీసుకుంది. మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించడంతో పాటు రాజధాని అమరావతికి విస్తరించాలని కేబినెట్ తీర్మానించింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని డీఎంఆర్‌సీ చేపట్టనుంది.

ఈ నిర్ణయాలన్నీ గతంలోనే జరిగినా వాటికి కేబినెట్ అధికారికంగా బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 25.76 కిలోమీటర్ల మేర రెండు కారిడార్లలో నిర్మించే తొలి దశ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.5,705 కోట్లు ఖర్చవుతుందని డీఎంఆర్‌సీ సవివర నివేదికలో పేర్కొంది. నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి ప్రాజెక్టు పూర్తవడానికి నాలుగేళ్ల సమయం పడుతుందని చెప్పిన డీఎంఆర్‌సీ అప్పటికి అంచనా వ్యయం రూ.6,823 కోట్లు అవుతుందని స్పష్టం చేసింది.

మొదటి కారిడార్ పండిట్ నెహ్రూ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు 12.76 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కారిడార్‌లో 12 స్టేషన్లు ఏర్పాటుచేస్తారు. రెండో కారిడార్ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి నిడమానూరు వరకు 13 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కారిడార్‌లో 13 స్టేషన్లు నెలకొల్పుతారు.
 
కంట్రోల్ పాయింట్‌గా పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్
పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ మెట్రో ప్రాజెక్టు కంట్రోల్ పాయింట్‌గా, సంయుక్త బస్‌స్టేషన్‌గా ఉంటుంది. మొదటి కారిడార్‌ను రెండో దశలో రాజధాని అమరావతికి విస్తరిస్తారు. ఇందుకోసం కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రస్తుతం ఉన్న రైలు బ్రిడ్జికి 200 మీటర్ల అవతల మరో బ్రిడ్జిని నిర్మిస్తారు. అటు నుంచి ప్రాజెక్టును తుళ్లూరుకు కలుపుతారు. రెండో కారిడార్‌ను రెండో దశలో గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు విస్తరిస్తారు.
 
అనుమతులు వచ్చేందుకు ఎస్‌పీవీ ఏర్పాటు

మెట్రో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను శ్రీధరన్ నేతత్వంలోని డీఎంఆర్‌సీకే అప్పగించిన ప్రభుత్వం దీనిపై బుధవారం లాంఛనంగా నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 40 శాతం నిధులను భరిస్తాయి. మిగిలిన 60 శాతం నిధులను జపాన్‌కు చెందిన జైకా తదితర సంస్థల నుంచి సేకరించాలని నిర్ణయించారు. దీనిపై జైకా సంస్థతో ఇప్పటికే ప్రభుత్వం చర్చలు కూడా జరిపింది. ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు వెంటనే వచ్చేందుకు ప్రభుత్వం ఎస్‌పీవీ (స్పెషల్ పర్పస్ వెహికల్)ని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు మంత్రిమండలి కూడా ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేయడంతో దానికి సంబంధించిన ధృవీకరణ అందగానే డీఎంఆర్‌సీ పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement