గ్రావెల్‌ ‘డాన్‌’

Gravel Smuggling In PSR Nellore - Sakshi

కావలి నియోజకవర్గంలోని చెరువుల్లో తవ్వకాలు

రోజుకు వేల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ కొల్లగొట్టేస్తున్నారు

మొక్కుబడిగా అనుమతి.. ఇష్టారాజ్యంగా రవాణా

పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు ముందస్తుహెచ్చరికలు

ఇప్పటికే మూడు చెరువుల్లో గ్రావెల్‌ ఖాళీ

ఆయన జిల్లా అధికార పార్టీలో కీలక నాయకుడు. నెల్లూరు– కావలి మధ్య రైల్వే మూడో ట్రాక్‌ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో గ్రావెల్‌ అవసరమైంది. ఇందు కోసం తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని గ్రావెల్‌ డాన్‌గా మారాడు. కావలి నియోజకవర్గంలోని చెరువులపై కన్నేశాడు. ఇంకేముంది గ్రావెల్‌ కొల్లగొట్టడానికి ఇరిగేషన్, మైనింగ్‌ అధికారులతో మాట్లాడి మొక్కుబడిగా అనుమతులు తీసుకుని చెరువులను కుళ్లబొడిచేస్తున్నాడు. తన బినామీలను రంగ ప్రవేశం చేయించి భారీగా ప్రొక్లెయిన్లతో చెరువుల్లో రోజుకు వేల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ను తవ్వేసి రవాణా చేస్తున్నాడు. తన గ్రావెల్‌ వాహనాలకు అడ్డు పడకుండా పోలీస్, రెవెన్యూ అధికారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాడు. గ్రామస్తుల ఫిర్యాదులతో చెరువుల వద్దకు వెళ్లిన వీఆర్వోలు అసలు విషయం తెలుసుకుని పెద్దోళ్లతో మనకెందుకులే అని వెళ్లిపోతున్నారు.

నెల్లూరు, కావలి: నెల్లూరు–కావలి మధ్య మూడో రైలు మార్గం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం కోట్లాది క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ అవసరమైంది. జిల్లాలో జిగురు మోతాదు ఎక్కువ పాళ్లలో ఉండి, గట్టితనంతో సులువుగా నేలపై ఇమిడిపోయే రకం గ్రావెల్‌ మట్టి కావలి నియోజకవర్గంలో చాలా చోట్ల అందుబాటులో ఉంది. సదరు పనులు చేస్తున్న నిర్మాణ సంస్థలు ఈ పరిసరాల్లో గ్రావెల్‌ మట్టిని పరిశీలించాయి. ఈ మట్టిని రవాణా చేసేందుకు దళారుల ద్వారా అధికార పార్టీలో కీలక నేతను సంప్రదించారు. ఏ ప్రాంతాల్లోని చెరువుల్లో గ్రావెల్‌ మట్టి కావాలో స్పష్టత ఇచ్చారు. రూ.కోట్ల చేతులు మారడంతో రంగంలోకి దిగిన సదరు నేత తన అధికారంతోఅధికారుల పరంగా అవసరమైన అనుమతులను తీసుకున్నారు. తన అనుచరగణాన్ని దించేసి ఒక్కొక్కరికి ఒక్కో చెరువును అప్పగించి గ్రావెల్‌ రవాణా చేసే బాధ్యతను అప్పగించారు.  

ఇప్పటికే మూడు చెరువులు గుల్ల
కావలి నియోజకవర్గంలో కావలిరూరల్, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల్లో మొత్తం 83 చెరువులు ఉన్నాయి. వీటిలో కావలి పట్టణంలోని మద్దూరుపాడు, మండలంలోని రుద్రకోట, బోగోలు మండలంలోని కోవూరుపల్లి, కడనూతల, పాత బిట్రగుంట, బోగోలు, దగదర్తి మండలంలోని సున్నపుబట్టి, అల్లూరు మండలం నార్తు ఆములూరు, గ్రద్దగుంట, బిట్రకాగొల్లు గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో విచ్చలవిడిగా గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. నేల చదరంగా మైదానంలా ఉన్న చెరువులను గుల్ల చేస్తున్నారు. భారీ ప్రొక్లెయిన్లు, పదులు సంఖ్యలో టిప్పర్లు పెట్టి ఇప్పటికే బోగోలు మండలంలోని కోవూరుపల్లి, కావలి మండలంలోని మద్దూరుపాడు, రుద్రకోట చెరువులను కుళ్లబొడి చేశారు. తాజాగా బోగోలు మండలంలోని కడనూతల చెరువుపై పడ్డారు. నిత్యం వందలాది టిప్పర్లు గ్రావెల్‌ రాకపోకలు సాగిస్తుండటంతో ఆ ప్రాంత గ్రామాలన్నీ కూడా మట్టికొట్టుకుపోతున్నాయి. అల్లూరు మండలం సౌత్‌ ఆమలూరులో ఉన్న ప్రభుత్వ భూముల్లో కూడా ఈ గ్రావెల్‌ దందా మూడు నెలలలుగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. అధికార జిల్లా టీడీపీ కీలక నేత ధన దాహానికి కావలి నియోజకవర్గంలోని చెరువులు బావులుగా మారిపోతున్నాయి.

మొక్కుబడి అనుమతులు
చట్టంలో ఉన్న లొసుగులును అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు గ్రావెల్‌ రవాణాకు మొక్కుబడి అనుమతులు సంపాదిస్తున్నారు. ఒక క్యూబిక్‌ మీటర్‌ గ్రావెల్‌కు ఇరిగేషన్‌ శాఖ ఒక్క రూపాయి, గనుల శాఖకు రూ.30 వంతున చలానా రూపంలో చెల్లిస్తారు. ఒక్కో చెరువులో 10 వేలు క్యూబిక్‌ మీటర్లు గ్రావెల్‌ తరలింపునకు చలానాలు చెల్లిస్తున్నారు. అంటే నామ మాత్రపు ఫీజులు చెల్లించి ఒక్కో చెరువు నుంచి 900 టిప్పర్లు గ్రావెల్‌ తవ్వుకుని తరలించుకోవడానికి అనుమతులు పొందుతున్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా తరలింపు మాత్రం జాతరలా జరుగుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా రోజుకు వేల టిప్పులు టిప్పర్లలో గ్రావెల్‌ తరలిస్తున్నారు. ఒక్కో చెరువులో నెల రోజుల్లో 3 వేల ట్రిప్పులకు పైగా గ్రావెల్‌ను తరలించినట్లు సమాచారం. చెరువుల్లో గ్రావెల్‌ తవ్వకాలకు టీడీపీ నాయకులు పొందిన  అనుమతుల ప్రకారం నిబంధనలు అనుసరిస్తున్నారా లేదా అని పరిశీలించడానికి ఇరిగేషన్‌ అధికారుల కాని, గనులశాఖ అధికారులు కాని అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇక నిత్యం రోడ్డు మీద వెళ్లే ఇసుక, గ్రావెల్‌ ట్రాక్టర్లను పట్టుకుని కేసులు రాసే పోలీసులు, రెవెన్యూ అధికారులు సైతం సదరు నేతకు సంబంధించిన భారీ టిప్పర్లను కూడా చూసీ చూడనట్లు వదలేస్తున్నారు. 

సమీప గ్రామాల్లో ఆందోళన
చెరువుల్లో క్రమ పద్ధతిలో కాకుండా బావులను తలపించేలా నిలువెత్తు లోతులో అక్కడక్కడ పెద్ద గుంతలు తీసి గ్రావెల్‌ మట్టిని తరలిస్తున్నారు. సమీప భవిష్యత్‌లో వర్షాలు కురిస్తే ఆ గుంతల్లోకి నీళ్లు చేరితే పశువుల మేతకు వెళ్లినప్పుడు, నీరు తాగడానికి, రైతులు, పిల్లలు  చెరువుల వద్దకు వెళ్లినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top