gravel quarry
-
తవ్వు.. తరలించు
వరదయ్యపాళెంలోని శోత్రియ భూములకు భద్రత కరువైంది. ఓవైపు ఇంటి స్థలాల పేరుతో పుట్టుకొస్తున్న అక్రమ గుడిసెలు.. మరోవైపు కబ్జాకు గురై సాగు చేస్తున్న భూములతో ఇప్పటికే ఈ ప్రాంతం రూపు కోల్పోతోంది. తాజాగా వీరికి గ్రావెల్ దొంగలు తోడవడంతో శోత్రియ భూముల అస్థిత్వానికే ముప్పు ఏర్పడింది. వరదయ్యపాళెం: మండల పరిధిలోని చిన్న పాండూరు సమీపంలో 1,060 ఎకరాల శోత్రియ భూములున్నాయి. ఈ భూములకు సంబంధించి ఆటు ప్రభుత్వానికి, ఇటు ప్రైవేటు వ్యక్తులకు మధ్య కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అదునుగా భావించిన గ్రావెల్ మాఫియా గడిచిన కొద్దిరోజులుగా రాత్రి వేళల్లో అక్రమంగా తవ్వకాలు జరిపి శ్రీసిటీ పరిశ్రమలకు గ్రావెల్ తరలించి లక్షల రూపాయిలు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఈ భూముల్లో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఇంత జరుగుతున్నా.. రెవెన్యూ అధికారుల మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చిన్న పాండూరు చెరువు నుంచీ.. శోత్రియ భూముల సమీపంలోని చిన్న పాం డూరు సాగునీటి చెరువు నుంచి కూడా పెద్దఎత్తున గ్రావెల్ తరలిస్తున్నారు. ఎన్నికల కోడ్ను బూచిగా చూపి రాత్రికి రాత్రే చెరువు మట్టిని కొల్లగొడుతున్నారు. ఈ క్రమాలను అడ్డుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు అటువైపు కూడా కన్నెత్తి చూడడం లేదు. ఇటీవల చిన్న పాండూరు చెరువుకు సంబంధించి నీరు–చెట్టు ద్వారా రూ. 35 లక్షలతో పనులు చేపట్టారు. ఆసమయంలో పెద్దఎత్తున మట్టిని తరలించిన స్థానిక టీడీపీ నేతలు లక్షల రూపాయిలు జేబులు నింపుకున్నారు. అయితే మళ్లీ అదే చెరువు నుంచి యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రావెల్కి భలే గిరాకీ అటు శ్రీసిటీ, ఇటు హీరో, అపోలో పరిశ్రమలు ఏర్పాటు కావడం, వీటికితోడు కొత్తగా పుట్టుకొస్తున్న రియల్ వెంచర్ల కారణంగా స్థానికంగా గ్రావెల్ మట్టికి గిరాకీ ఏర్పడింది. దీంతో ఈ వ్యాపారాన్ని ఎంచుకున్న అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు అక్రమ లీజులతో చెరువులలో ఎంచక్కా మట్టి వ్యాపారాన్ని దర్జాగా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో 1000 ఎకరాల వీస్తీర్ణంలో ఖాళీగా ఉన్న శోత్రియ భూములపై అక్రమార్కుల కన్నుపడింది. దీంతో ఎలాంటి లీజులు, అనుమతులు పొందకనే అధికారుల అండతో రాత్రికిరాత్రే మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక టిప్పర్ లారీ మట్టి రూ.10వేలకుపైగా రేటు పలకడంతో అధికారులకు సైతం పెద్ద మొత్తంలో ముడుపులు అందుతున్నట్లు తెలిసింది. ఇకపై మేమూ మట్టి తరలిస్తాం.. సంబంధంలేని వ్యక్తులు యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుపుతున్న నేపథ్యంలో.. తమ అనుభవంలోని శోత్రియ భూములలో తామూ.. ఇకపై మట్టితరలిస్తామని అనుభవదారులు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించకుంటే.. ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. చర్యలు తీసుకుంటాం.. శోత్రియ భూముల్లో గ్రావెల్ తవ్వకాలపై స్థానికుల నుంచి మాకు ఫిర్యాదు అందింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తవ్వకాలు జరిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నిబంధనలను ఉల్లంఘిస్తే.. ఎంతటివారినైనా వదిలేది లేదు. – వెంకటరమణ, తహసీల్దార్, వరదయ్యపాళెం -
గ్రావెల్ ‘డాన్’
ఆయన జిల్లా అధికార పార్టీలో కీలక నాయకుడు. నెల్లూరు– కావలి మధ్య రైల్వే మూడో ట్రాక్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో గ్రావెల్ అవసరమైంది. ఇందు కోసం తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని గ్రావెల్ డాన్గా మారాడు. కావలి నియోజకవర్గంలోని చెరువులపై కన్నేశాడు. ఇంకేముంది గ్రావెల్ కొల్లగొట్టడానికి ఇరిగేషన్, మైనింగ్ అధికారులతో మాట్లాడి మొక్కుబడిగా అనుమతులు తీసుకుని చెరువులను కుళ్లబొడిచేస్తున్నాడు. తన బినామీలను రంగ ప్రవేశం చేయించి భారీగా ప్రొక్లెయిన్లతో చెరువుల్లో రోజుకు వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ను తవ్వేసి రవాణా చేస్తున్నాడు. తన గ్రావెల్ వాహనాలకు అడ్డు పడకుండా పోలీస్, రెవెన్యూ అధికారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాడు. గ్రామస్తుల ఫిర్యాదులతో చెరువుల వద్దకు వెళ్లిన వీఆర్వోలు అసలు విషయం తెలుసుకుని పెద్దోళ్లతో మనకెందుకులే అని వెళ్లిపోతున్నారు. నెల్లూరు, కావలి: నెల్లూరు–కావలి మధ్య మూడో రైలు మార్గం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం కోట్లాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అవసరమైంది. జిల్లాలో జిగురు మోతాదు ఎక్కువ పాళ్లలో ఉండి, గట్టితనంతో సులువుగా నేలపై ఇమిడిపోయే రకం గ్రావెల్ మట్టి కావలి నియోజకవర్గంలో చాలా చోట్ల అందుబాటులో ఉంది. సదరు పనులు చేస్తున్న నిర్మాణ సంస్థలు ఈ పరిసరాల్లో గ్రావెల్ మట్టిని పరిశీలించాయి. ఈ మట్టిని రవాణా చేసేందుకు దళారుల ద్వారా అధికార పార్టీలో కీలక నేతను సంప్రదించారు. ఏ ప్రాంతాల్లోని చెరువుల్లో గ్రావెల్ మట్టి కావాలో స్పష్టత ఇచ్చారు. రూ.కోట్ల చేతులు మారడంతో రంగంలోకి దిగిన సదరు నేత తన అధికారంతోఅధికారుల పరంగా అవసరమైన అనుమతులను తీసుకున్నారు. తన అనుచరగణాన్ని దించేసి ఒక్కొక్కరికి ఒక్కో చెరువును అప్పగించి గ్రావెల్ రవాణా చేసే బాధ్యతను అప్పగించారు. ఇప్పటికే మూడు చెరువులు గుల్ల కావలి నియోజకవర్గంలో కావలిరూరల్, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల్లో మొత్తం 83 చెరువులు ఉన్నాయి. వీటిలో కావలి పట్టణంలోని మద్దూరుపాడు, మండలంలోని రుద్రకోట, బోగోలు మండలంలోని కోవూరుపల్లి, కడనూతల, పాత బిట్రగుంట, బోగోలు, దగదర్తి మండలంలోని సున్నపుబట్టి, అల్లూరు మండలం నార్తు ఆములూరు, గ్రద్దగుంట, బిట్రకాగొల్లు గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. నేల చదరంగా మైదానంలా ఉన్న చెరువులను గుల్ల చేస్తున్నారు. భారీ ప్రొక్లెయిన్లు, పదులు సంఖ్యలో టిప్పర్లు పెట్టి ఇప్పటికే బోగోలు మండలంలోని కోవూరుపల్లి, కావలి మండలంలోని మద్దూరుపాడు, రుద్రకోట చెరువులను కుళ్లబొడి చేశారు. తాజాగా బోగోలు మండలంలోని కడనూతల చెరువుపై పడ్డారు. నిత్యం వందలాది టిప్పర్లు గ్రావెల్ రాకపోకలు సాగిస్తుండటంతో ఆ ప్రాంత గ్రామాలన్నీ కూడా మట్టికొట్టుకుపోతున్నాయి. అల్లూరు మండలం సౌత్ ఆమలూరులో ఉన్న ప్రభుత్వ భూముల్లో కూడా ఈ గ్రావెల్ దందా మూడు నెలలలుగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. అధికార జిల్లా టీడీపీ కీలక నేత ధన దాహానికి కావలి నియోజకవర్గంలోని చెరువులు బావులుగా మారిపోతున్నాయి. మొక్కుబడి అనుమతులు చట్టంలో ఉన్న లొసుగులును అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు గ్రావెల్ రవాణాకు మొక్కుబడి అనుమతులు సంపాదిస్తున్నారు. ఒక క్యూబిక్ మీటర్ గ్రావెల్కు ఇరిగేషన్ శాఖ ఒక్క రూపాయి, గనుల శాఖకు రూ.30 వంతున చలానా రూపంలో చెల్లిస్తారు. ఒక్కో చెరువులో 10 వేలు క్యూబిక్ మీటర్లు గ్రావెల్ తరలింపునకు చలానాలు చెల్లిస్తున్నారు. అంటే నామ మాత్రపు ఫీజులు చెల్లించి ఒక్కో చెరువు నుంచి 900 టిప్పర్లు గ్రావెల్ తవ్వుకుని తరలించుకోవడానికి అనుమతులు పొందుతున్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా తరలింపు మాత్రం జాతరలా జరుగుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా రోజుకు వేల టిప్పులు టిప్పర్లలో గ్రావెల్ తరలిస్తున్నారు. ఒక్కో చెరువులో నెల రోజుల్లో 3 వేల ట్రిప్పులకు పైగా గ్రావెల్ను తరలించినట్లు సమాచారం. చెరువుల్లో గ్రావెల్ తవ్వకాలకు టీడీపీ నాయకులు పొందిన అనుమతుల ప్రకారం నిబంధనలు అనుసరిస్తున్నారా లేదా అని పరిశీలించడానికి ఇరిగేషన్ అధికారుల కాని, గనులశాఖ అధికారులు కాని అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇక నిత్యం రోడ్డు మీద వెళ్లే ఇసుక, గ్రావెల్ ట్రాక్టర్లను పట్టుకుని కేసులు రాసే పోలీసులు, రెవెన్యూ అధికారులు సైతం సదరు నేతకు సంబంధించిన భారీ టిప్పర్లను కూడా చూసీ చూడనట్లు వదలేస్తున్నారు. సమీప గ్రామాల్లో ఆందోళన చెరువుల్లో క్రమ పద్ధతిలో కాకుండా బావులను తలపించేలా నిలువెత్తు లోతులో అక్కడక్కడ పెద్ద గుంతలు తీసి గ్రావెల్ మట్టిని తరలిస్తున్నారు. సమీప భవిష్యత్లో వర్షాలు కురిస్తే ఆ గుంతల్లోకి నీళ్లు చేరితే పశువుల మేతకు వెళ్లినప్పుడు, నీరు తాగడానికి, రైతులు, పిల్లలు చెరువుల వద్దకు వెళ్లినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
నీరు-చెట్టు..కాసులు పట్టు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కోర్టులో కేసులున్నా పట్టించుకోవడం లేదు. ఎక్కడ మట్టి తవ్వకానికి అనుగుణంగా ఉంటే అక్కడ తవ్వేసి అమ్మేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. నీరు- చెట్టు కార్యక్రమం వారికి కాసుల వర్షం కురిపిస్తోంది. చెరువుల్లో పూడిక తీసి, మొక్కలు నాటడం లక్ష్యంగా ప్రారంభమైన నీరు -చెట్టు పథకం రోజురోజుకూ తెలుగుతమ్ముళ్లు జేబులు నింపే పథకంగా మారిపోతోంది. దీనికి అధికారులు కూడా వంతపాడటం వివాదాలకు దారితీస్తోంది. ఐదేళ్లుగా అది అటవీ భూమి అని ఆ శాఖ... కాదని రెవెన్యూ శాఖల మధ్య వివాదం నడుస్తోండగా, ఆ భూమిని క్వారీ లీజుకు తీసుకున్న వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వివాదం కోర్టులో ఇంకా సాగుతుండగానే తెలుగు తమ్ముళ్లు నీరు-చెట్టును అడ్డం పెట్టుకుని ఆ భూమిలో తవ్వకాలు మొదలు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.... మార్టూరు మండలం నాగరాజుపల్లి కొండ వద్ద సర్వే నంబర్ 475/పిలో రోడ్డు గ్రావెల్ క్వారీ కోసం అదే గ్రామానికి చెందిన వేల్పుల వీరయ్య గనులు, భూగర్భ శాఖ వద్ద 2009లో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత తహశీల్దార్, సర్వేయర్, ఆర్ఐ వచ్చి తనిఖీ చేసి గనుల శాఖకు నిరభ్యంతర పత్రం ఇచ్చారు. ఆ తర్వాత గనుల శాఖ డిప్యూటీ డెరైక్టర్ ఐదేళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు అంగీకరించారు. సెక్యూరిటీ డిపాజిట్లు, లీజ్ రెంట్ అన్నీ చెల్లించాలని వీరయ్యకు లేఖ పంపారు. అయితే వీటిని చెల్లించడంలో జాప్యం జరిగింది. తర్వాత తనకు పొడిగింపు కావాలని వీరయ్య కోరిన మీదట అధికారులు అంగీకరించి అన్ని ఫీజులు కట్టించుకున్నారు. అయితే క్వారీ మాత్రం వీరయ్యకు అప్పగించలేదు. అటవీ శాఖ నుంచి అనుమతి తెచ్చుకోవాలని చెప్పారు. అటవీ శాఖ అధికారులు క్వారీలో తమ స్థలం ఉందా లేదా అన్న విషయం సర్వే చేసి చెబుతామన్నారు. అయితే ఈ నాగరాజుపల్లి కొండ మొత్తం అటవీ శాఖ పరిధిలోనే ఉందని అటవీ శాఖ అధికారులు వాదిస్తుండగా, రెవెన్యూ అధికారులు మాత్రం లేదని చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో 2011లోనే లీజుదారుడు వీరయ్య తనకు క్వారీ అప్పగించాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. 2013 ఏప్రిల్ ఎనిమిదో తేదీ కలెక్టర్ ఆదేశాలు, కోర్టు ఉత్తర్వుల మేరకు అటవీశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి హద్దులు నిర్ణయించారు. దీనిపై ఇంకా హైకోర్టు తీర్పు రావాల్సి ఉంది. ఈ లోగా నీరు-చెట్టు పథకం కింద పక్కనే ఉన్న ఇసుకదర్శి గ్రామంలో నీటిగుంతలలో పూడిక తీయడం కోసం అనుమతులు తీసుకున్న తెలుగుదేశం నాయకులు కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో తవ్వకాలు మొదలు పెట్టారు. పూడిక తీయడం బదులు, మట్టిని తవ్వి హైవే పనుల కోసం అమ్మేసుకుంటున్నారు. ఈ విషయంపై లీజుదారుడు అధికారులను ఆశ్రయించినా వారు తామేం చేయలేమని చేతులెత్తేయడంతో బాధితుడు కోర్టు ధిక్కారం కింద పిటీషన్ వేయడానికి సన్నద్ధం అవుతున్నాడు. -
గ్రావెల్ క్వారీలోపడి ఇద్దరు చిన్నారుల మృతి
విజయవాడ: గ్రావెల్ క్వారీలోపడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కోపూరులో ఈ విషాద ఘటన జరిగింది. ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు క్వారీలో పడిపోయారు. వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి మృత దేహాలను బయటకు తీశారు. పిల్లల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.