సచివాలయం పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

Grama sachivalayam Job Exams Start On September One 2019 - Sakshi

తొలిరోజు పరీక్షకు 1.52 లక్షల మంది పోటీ

ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో సెప్టెంబర్‌ 1, 3, 4, 6, 8 తేదీల్లో నిర్వహించే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నియామక రాత పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 13,057 పోస్టులకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 481 కేంద్రాల్లో పరీక్ష  నిర్వహణకు 11 వేల మంది అధికారులను వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షకు హాజరు కాబోతున్న అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

అభ్యర్థులకు రాత్రి బస
సెప్టెంబర్‌ ఒకటో తేదీన జరగనున్న వార్డు కార్యదర్శుల పరీక్షకు దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు రాత్రి బస ఏర్పాటు చేశారు. ఇందుకోసం నగరంలోని కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లను గుర్తించారు. అక్కడ అభ్యర్థులకు బస సౌకర్యం కల్పించారు. 31వ తేదీ శనివారం నగరానికి వచ్చిన అభ్యర్థులు వీటిని ఉపయోగించుకోవచ్చు.  

మహిళకు ప్రత్యేక వసతి
మహిళా అభ్యర్థులకు కోసం ప్రత్యేకంగా గోదావరి గట్టు మీద మార్కండేయేశ్వరస్వామి గుడి పక్కవీధిలో ఉన్న దర్భా వారి మున్సిపాల్‌ కార్పొరేషన్‌ సత్రంలో 
బస ఏర్పాటు చేశారు. 

పరీక్ష కేంద్రాల్లో క్లోక్‌ రూమ్‌లు
పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు అనుమతించరు. అన్ని పరీక్షా కేంద్రాల్లో బ్యాగులు భద్రపర్చుకోవడానికి క్లోక్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ వస్తువులను అందులో పెట్టుకోవచ్చు. బస్టాండ్, రైల్వే స్టేషన్‌లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా పరీక్షా కేంద్రాల చిరునామాలు తెలుసుకోవచ్చు. అలాగే హెల్ప్‌ డెస్క్‌ 0883–2479993, 94409 99178 నంబర్లను సంప్రదించవచ్చు. 

అన్ని ఏర్పాట్లు చేశాం
నగరంలో 59 పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాం. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. దూరప్రాంతాల నుంచి శనివారమే వచ్చేవారికి షెల్టర్లు ఏర్పాటు చేశాం. తాగునీరు. మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాం. భోజనాలు అభ్యర్థులే తెచ్చుకోవాలి. పరీక్ష ఏర్పాట్లపై శుక్రవారం సాయంత్రం వివిధ శాఖ అధికారులతో సమీక్షించాం. 
– సుమిత్‌ కుమార్, కమిషనర్, నగరపాలక సంస్థ, రాజమహేంద్రవరం

నిబంధనలు ఇవే..
బ్లూ/బ్టాక్‌ పాయింట్‌ పెన్ను, హాల్‌ టికెట్, గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, డ్రైవింగ్‌ లైసెన్స్,ఓటర్‌ కార్డులో ఒకటి తప్పనిసరి) తెచ్చుకోవాలి. ఆదివారం ఉదయం 9 గంటలకే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 9.30 గంటలకు పరీక్ష హాల్లోకి అనుమతించి ఓఎంఆర్‌ షీట్‌ ఇస్తారు. 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షకు 
అనుమతించరు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top