వెబ్‌సైట్‌లో ప్రభుత్వ భూములు | government lands in websites | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్‌లో ప్రభుత్వ భూములు

Jan 8 2014 3:22 AM | Updated on Sep 2 2017 2:22 AM

ప్రభుత్వ భూముల సమాచారం పొందుపరిచేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించిందని రాష్ట్ర భూపరిపాలన చీఫ్ కమిషనర్ ఐవైఆర్.కృష్ణారావు తెలిపారు

 కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ :
 ప్రభుత్వ భూముల సమాచారం పొందుపరిచేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించిందని రాష్ట్ర భూపరిపాలన చీఫ్ కమిషనర్ ఐవైఆర్.కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆయన మంగళవారం  కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వభూమి పరిరక్షణ, వీఆర్వో, వీఆర్‌ఏల పోస్టులభర్తీకి సంబధించిన పరీక్ష నిర్వహణ, మీ-సేవా, ఆధార్ కార్డుల నమోదు, కోర్టు కేసుల పెండింగ్ తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి వాటి వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15వ తేదీలోపు ఈ సమాచారాన్ని అప్‌లోడ్ చేయాలని సూచించారు. వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీ కోసం పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసేందుకు పలు సూచనలు  చేశారు.  జిల్లా ప్రధాన కేంద్రంలో ఉన్న విద్యాసంస్థల్లో పరీక్ష నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
 
 జిల్లా ప్రధాన కేంద్రంలో ఉన్న విద్యాసంస్థలు సరిపోకపోతే రెవెన్యూ డివిజన్ ప్రధాన కేంద్రంలో నిర్వహించాలన్నారు. జిల్లాలో ఆధార్ నమోదు వేగవంతం చేయాలని సూచించారు. వివిధ సంస్థలకు కేటాయించిన ప్రభుత్వ భూములు వినియోగించకుండా ఖాళీగా ఉంచితే ఆ సంస్థలకు నోటీసులు జారీ చేయాలని చెప్పారు. కోర్టు కేసులు, పెండింగ్ ఆడిట్ అభ్యంతరాలు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, డీఆర్వో విజయచందర్, సబ్ కలెక్టర్లు హరిచందన, చక్రధరరావు, ఆర్డీవోలు పి.సాయిబాబు, వెంకటసుబ్బయ్య, అర్బన్ ల్యాండ్ భూసేకరణ ప్రత్యేకాధికారి ఎన్.రమేష్‌కుమార్, ట్రైనీ కలెక్టర్ కాళీచరణ్‌సుందరావు, డీఐవో శర్మ, కలెక్టరేట్ ఏవో ఇందిరాదేవి తదితర సెక్షన్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
 
 భూగర్భజలాల పర్యవేక్షణకు చర్యలు....
 భూగర్భ జలాల పర్యవేక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో మంగళవారం భూగర్భజలాల హైడ్రాలజికల్ డేటా యూజర్స్ గ్రూపు కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఇరిగేషన్, డ్రెయినేజీ, ఆర్‌డబ్ల్యూఎస్, రెవెన్యూ సంబంధితశాఖల అధికారుల సహకారంతో హైడ్రాలజీ విభాగం అధికారులు భూగర్భజలాల అధిక వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలు తాగునీరు, సాగునీరు పొదుపుగా వాడుకోవటం తదితర అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
 
 హైడ్రాలజీ ప్రాజెక్టు గుంటూరు డివిజన్ ఈఈ పి.అరుణ, డ్వామా పీడీ అనిల్‌కుమార్, మైక్రో ఇరిగేషన్ పీడీ మంజుల, హార్టికల్చర్ ఏడీ సుబానీ, భూగర్భ జల విభాగం రాజమండ్రి డివిజన్ సహాయ పరిశోధనాధికారి రత్నప్రశాంతి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ అమరేశ్వరరావు, సీపీవో వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement