ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కేరోజా
ప్రజలు అనారోగ్యంతో అల్లాడుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఎమ్మెల్యే ఆర్కేరోజా మండిపడ్డారు. నగరి మున్సిపాలిటీలో శనివారం దోమలపై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
– మంత్రులుగా కామినేని, నారాయణ ఫెయిల్
– డెంగీ సోకిన ఆరు నెలలకు మేల్కొంటారా?
– ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజం
నగరి: ప్రజలు అనారోగ్యంతో అల్లాడుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఎమ్మెల్యే ఆర్కేరోజా మండిపడ్డారు. నగరి మున్సిపాలిటీలో శనివారం దోమలపై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇది దొంగలు పడి దోచుకెళ్లిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు.. డెంగీ, విష జ్వరాలతో జనం ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం ఇప్పుడు మేల్కొందని విమర్శించారు. వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్కు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వెనక తిరగడానికే సమయం సరిపోతోందన్నారు.
అనంతపురంలో డెంగీ వ్యాధితో ఇద్దరు చిన్నారులు చనిపోతే హెల్త్ ఎమర్జెన్సీ విధించారని ఆ జిల్లాకు ఇన్చార్జి మంత్రి, డాక్టర్ అయిన ఆయన జిల్లాకు వెళ్లి పరిస్థితులను పరిశీలించలేదన్నారు. ఆయన నిజమైన డాక్టరా ‘శంకర్దాదా ఎంబీబీఎస్’ లాంటి డాక్టరా అనే సందేహం కలుగుతోందని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా పురపాలక శాఖ మంత్రి నారాయణ నగరి నియోజకవర్గంలో ఉన్న రెండు మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు ఆయన కనీసం అడుగు కూడా పెట్టలేదన్నారు. పారదోలండి అంటే దోమలు పారిపోవని పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి కావలసిన నిధులు మంజూరు చేసి, తగినంతమంది సిబ్బందిని నియమించాలని హితవు పలికారు. దోమలపై దండయాత్ర అంటూ ర్యాలీలు చేయడంతోనే దోమలను అరికట్టలేమన్నారు. మంత్రులుగా ఫెయిల్ అయిన కామినేని, నారాయణ వారి పదవులకు రాజీనామా చేయాలన్నారు.