వెనుకబడిన జిల్లాల నిధులు పక్కదారి | Funding for the backward districts is misleading | Sakshi
Sakshi News home page

వెనుకబడిన జిల్లాల నిధులు పక్కదారి

Sep 23 2018 4:52 AM | Updated on Nov 9 2018 5:56 PM

Funding for the backward districts is misleading - Sakshi

సాక్షి, అమరావతి: వెనుకబడిన జిల్లాలకు కేంద్రం అరకొరగా ఇచ్చిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. దీంతో ఆయా జిల్లాలకు తీరని అన్యాయం జరిగినట్లు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) గుర్తించింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన రికార్డులను కూడా రూపొందించలేదని వ్యాఖ్యానించింది. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇచ్చిన నిధులను రాజధాని అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది. ఒకపక్క రాజధాని పూర్తికాలేదు. మరోపక్క ఆ నిధులు ఇవ్వకుండా వెనుకబడిన జిల్లాలకు అన్యాయం జరిగడం గమనార్హం. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.350 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో ఇతర అవసరాల కోసం మళ్లించినట్లు కాగ్‌ గుర్తించింది.

కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించిన వినియోగ ధ్రువీకరణ పత్రాలను(యూసీలు) సమర్పించడంలోనూ రాష్ట్ర సర్కార్‌ విఫలమైందని తేల్చింది. 2014–15లో రాజధాని నిర్మాణానికి కేంద్రం విడుదల చేసిన రూ.500 కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిపాటు వినియోగించకుండా ఖజానాలోనే ఉంచేసిందని కాగ్‌ తెలిపింది. కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు తాజాగా నివేదిక విడుదల చేసింది. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇస్తామని రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న సీఎం చంద్రబాబు ఈ ప్యాకేజీని రప్పించడంలో ఘోరంగా విఫలమయ్యారు. 2015–16లో రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక సాయం కింద కేంద్రం జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.350 కోట్లు విడుదల చేసినట్లు కాగ్‌ ఆడిట్‌లో వెల్లడైంది.

గతంలో కేంద్రం ఆగ్రహం..
2017–18కి సంబంధించి కాగ్‌ ఆడిట్‌ నిర్వహించింది. ఆ ఆడిట్‌ పేరాలను సీఆర్‌డీఏ సమర్పించింది. సవివరమైన ఆధారాలతో కూడిన వివరణను సీఆర్‌డీఏ ఇస్తే, ఆడిట్‌ నుంచి ఆ పేరాలను కాగ్‌ తొలగిస్తుంది. లేదంటే ఆడిట్‌ నివేదికలో యథాతథంగా పొందుపరుస్తుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు జిల్లాల అభివృద్ధి కోసం ప్రత్యేక సాయంగా ఇచ్చిన నిధులను నిబంధనల మేరకు వెచ్చించకుండా, ఇతర పనులకు ఖర్చు చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వం గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. 

నిధుల వినియోగంలో జాప్యమెందుకు?
2014–15లో రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ.500 కోట్లు విడుదల చేసిందని.. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను ఏడాదిపాటు ఖజానాలోనే ఉంచిందని ‘కాగ్‌’ అడిట్‌ నివేదికలో పేర్కొంది. కేంద్రం ఇచ్చిన నిధులను వినియోగించకుండా జాప్యం చేసిందని తప్పుబట్టింది. దీనిపై సీఆర్‌డీఏను వివరణ కోరగా.. ఇది తమకు సంబంధించిన అంశం కాదని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని పేర్కొనడం గమనార్హం. రాజధానిలో రాజ్‌భవన్, హైకోర్టు నిర్మాణాలకు కేంద్రం ఇచ్చిన నిధులను సైతం రాష్ట్ర సర్కారు దారి మళ్లించిందని కాగ్‌ తేల్చిచెప్పింది. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, మండలి నిర్మాణాలతోపాటు భూములిచ్చిన రైతులకు వార్షిక వాయిదాలకు, పింఛన్లు ఇచ్చేందుకు ఈ నిధులను వినియోగించిందని పేర్కొంది.

కేంద్ర నిధులను తాత్కాలిక సచివాలయ భవనాలు నిర్మించిన షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌అండ్‌టీ సంస్థలకు చెల్లించిందని తెలిపింది.  2015 ఏప్రిల్‌ 1 నుంచి 2017 మార్చి 31 వరకు కేంద్రం ఇచ్చిన నిధులు రూ.769.34 కోట్లు అందుబాటులో ఉండగా, కేవలం రూ.392.98 కోట్లే వ్యయం చేశారని కాగ్‌ ఆడిట్‌లో వెల్లడించింది. నిధుల ఖర్చుపై ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదని వ్యాఖ్యానించింది. రాజధానిలో శాశ్వత భవనాల నిర్మాణం కోసం ఇచ్చిన నిధులను తాత్కాలిక భవనాలు కట్టడానికి వెచ్చించినట్లు రాష్ట్ర సర్కారు వినియోగ పత్రాలు పంపినప్పటికీ నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వం ఆమోదించాయని కాగ్‌ పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement