బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లి అమ్మవార్ల కల్యాణం వైభవంగా సాగింది.
ఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లి అమ్మవార్ల కల్యాణం వైభవంగా సాగింది. 108 దివ్యక్షేత్రాల్లో జరిగే బ్రహ్మోత్సవాల్లో కల్యాణోత్సవం జరిగేది ఒక్క అహోబిల క్షేత్రం మాత్రమే. అందుకే అహోబిలంలో జరిగే కల్యాణోత్సవాన్ని తిలకించడానికి వేలాదిగా భక్తులు హాజరయ్యారు. అహోబిలమఠం 46 పీఠాధిపతి శ్రీవన్శఠగోప యతీంద్రమహదేశికన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్ దివ్య కల్యాణ క్రతువును నిర్వహించారు.
టీటీడీ ఈవో సాంబశివరావు టీటీడీ తరఫున ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. తన కల్యాణోత్సవ సమయంలో వెంకటేశ్వరస్వామి అహోబిల నరసింహస్వామిని పూజించారని పురాణాలు చెపుతున్నాయి. వెంకటేశ్వరస్వామి ఇష్టదైవమైన నరసింహస్వామి కళ్యాణానికి టీటీడీ తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. వేదపండితులు విశ్వక్షేణునికి మొదట పూజలు నిర్వహించారు. ఘంటానాదం, మంగళవాయిద్యాలు నడుమ స్వామివారికి, అమ్మవారికి కంకణధారణ కార్యక్రమం నిర్వహించారు. లోకరక్షణ కోసం రక్షబంధనంను సంప్రదాయబద్ధంగా జరిపారు.
స్వామి వారికి,అమ్మవారికి మంగళనీరాజనం అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.స్త్రీసూక్తం, పురుష సూక్త పారాయణం చేశారు. నిత్యహోమంను హోమద్రవ్యాలతో నిర్వహించారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణ మధ్య మాంగళ్యధారణ కార్యక్రమం జరిపారు. పీఠాధిపతికి ఆలయ మర్యాదలు చేశారు. కల్యాణోత్సవాన్ని దేవ స్థాన అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, దేవస్థాన మేనేజర్ రామానుజన్లు పర్యవేక్షించారు.ఎఎస్పీ శశికుమార్, సీఐ ఓబులేసు, ఎస్సైలు సాయినాథ్, సోమ్లానాయక్లు బందోబస్తు నిర్వహించారు.