ఈ-పాస్‌కు ఆదిలోనే హంసపాదు | Epass servers not working | Sakshi
Sakshi News home page

ఈ-పాస్‌కు ఆదిలోనే హంసపాదు

Apr 6 2015 3:51 AM | Updated on Sep 2 2017 11:54 PM

ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు ఆదివారం ఈ-పాస్ ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభించారు.

పని చేయని సర్వర్
ఇబ్బందులుపడ్డ కార్డుదారులు

 
నెల్లూరు(రెవెన్యూ) : ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు ఆదివారం ఈ-పాస్ ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభించారు. ప్రారంభంలోనే ఈ విధానంతో డీలర్లు, కార్డుదారులు ఇబ్బందులుపడ్డారు. ఈ-పాస్ సర్వర్ పని చేయకపోవడంతో మిషన్లు ఆన్ కాలేదు. డీలర్లు ఇబ్బందులుపడ్డారు. గంటల సమయం కార్డుదారులు షాపుల వద్ద పడిగాపులుకాశారు. ఫలితం లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుతిరిగారు. చౌకదుకాణాల డీలర్లు హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు.

హైల్ప్‌లైన్ సిబ్బంది వచ్చి మిషన్లను పరిశీలించినా ఫలితం లేదు.  జిల్లాలో 1874 చౌకదుకాణాలున్నాయి. నెల్లూరు కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని 320 చౌకదుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేశారు. కార్డుదారుల వివరాలు అప్‌లోడ్ చేశారు. ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభించారు. నెల్లూరు నగరం, రూరల్ ప్రాంతాల్లోని 90 శాతం చౌకదుకాణాల్లో ఈ-పాస్ విధానం పని చేయలేదు. పలు షాపుల్లో మిషన్లు ఆన్‌కాకాపోవడంతో కార్డుదారులు అవస్థలుపడ్డారు.

ఈ-పాస్ మిషన్‌లో కార్డుదారుల వివరాలు నమోదు చేసి కావాల్సిన రేషన్‌కు సంబంధించి వేర్వేరుగా నమోదు చేయాల్సి ఉంది. మిషన్‌లో వివరాలు నమోదు చేస్తేనే రేషన్ విడుదలవుతుంది. మిషన్లు పని చేయకపోవడంతో రేషన్ పంపిణీ కాలేదు. ఈ-పాస్ విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ-పాస్ విధానంలోనే రేషన్ పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. డీలర్లు సాధారణ విధానం ద్వారా రేషన్ పంపిణీ చేసేందుకు అధికారులు అనుమతి ఇవ్వడంలేదు. ఏదిఏమైనా నూతన విధానం కార్డుదారులను ఇబ్బందులకు గురి చేస్తుంది.

సర్వర్ పనిచేయలేదు : సంధ్యారాణి, డీఎస్‌ఓ

ఈ-పాస్ విధానం ద్వారా ప్రజా పంపిణీ ప్రారంభించాం. సర్వర్ పని చేయకపోవడంతో ఈ-పాస్ మిషన్లు పని చేయలేదు. ఈ విషయం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు తెలియజేశాం. త్వరలో సర్వర్ పని చేసేలా చర్యలు తీసుకుంటాం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement