సార్వత్రిక సమరం షురువైంది. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేయడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సార్వత్రిక సమరం షురువైంది. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేయడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రెండు రోజుల క్రితమే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో పార్టీలు, నాయకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. షెడ్యూల్ వెలువడటంతో టిక్కెట్లు ఆశి స్తున్న వారు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఏప్రిల్ 2న ఎన్నికల నోటిషికేషన్ విడుదల అవుతుండగా, ఫలితాలు మే 16న వెలువడనున్నాయి.
‘కోడ్’ అమలు
జిల్లాలో పది అసెంబ్లీ, రెండు లోక్సభ నియోజకవర్గాలున్నాయి. ఆదిలాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఆసిఫాబాద్(ఎస్టీ), బోథ్(ఎస్టీ), ఖానాపూర్(ఎస్టీ), సిర్పూర్, ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్ స్థానాలున్నాయి. పెద్దపల్లి ఎంపీ నియోజకవర్గ పరిధిలో చెన్నూరు(ఎస్సీ), బెల్లంపల్లి (ఎస్సీ), మంచిర్యాల అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 19.18 లక్షల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 9.60 లక్షల మంది పురుషులు కాగా, 9.57 లక్షల మంది స్త్రీలు ఉన్నారు. నూతన ఓటర్ల నమోదుకు మార్చి 9 వరకు గడువు ఉంది. ఈసారి నూతనంగా ఓటర్లు నోటాను వినియోగించుకునే అవకాశం లభించింది. బరిలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చని పక్షంలో ఈ నోట మీట నొక్కేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. షెడ్యూల్ వెలువడిన వెంటనే జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది.
అన్ని ఏర్పాట్లు పూర్తి
ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కొన్ని నెల లుగా కసరత్తు చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగం పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 15 పర్యవేక్షక కమిటీలను నియమించాలని నిర్ణయించింది. పోలింగ్కు అవసరమైన ఈవీఎం(ఎలక్ట్రానిక్స్ ఓటింగ్ మిషన్లు)లను సిద్ధం చేశారు. ఇటీవలే ఈవీఎంలు జిల్లాకు చేరుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 2,256 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు వాటిని గుర్తించారు. తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. కాగా, నామినేషన్ల నుంచే అభ్యర్థుల ఖర్చు లెక్కలోకి వస్తుంది.
భారీ బందోబస్తు
ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా పోలీసుశాఖ గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు జిల్లా భద్రత ప్రణాళికను సిద్ధం చేసిన పోలీసు యంత్రాం గం జిల్లాలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, మత ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జైనథ్ మండలంలోని భోరజ్ వద్ద, సోన్, ఇందారం, లక్సెట్టిపేట గూడెం, వాంకిడి, తలమడుగు మండలంలోని తమల్కోట్, ఖానాపూర్ బాదన్కుర్తి, బాసరలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.