దళిత ఉద్యమ కళాకారుడు డప్పు ప్రకాశ్‌ కన్నుమూత

దళిత ఉద్యమ కళాకారుడు డప్పు ప్రకాశ్‌ కన్నుమూత - Sakshi


తెనాలి: ‘పల్లె పల్లెన దళిత కోయిల’ అంటూ కలేకూరి ప్రసాద్‌ గీతాలకు తన గొంతుతో జీవం పోస్తూ.. ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన ఒకప్పటి నక్సలైటు ఉద్యమ కళాకారుడు, ప్రజా గాయకుడు డప్పు ప్రకాశ్‌ (60).. నేడు రోడ్డుపై అనాథలా మృతి చెందాడు. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ దుకాణం మెట్లపై ఆదివారం ప్రకాశ్‌ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మృతుడు డప్పు ప్రకాశేనా అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు మృతదేహం ఫొటోలను దళిత, ప్రజాసంఘాల నేతలకు పంపించారు.



 వారు నిర్ధారించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సోమవారం తెనాలిలోనే ప్రకాశ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రకాశ్‌ స్వస్థలం తెలంగాణలోని కొత్తగూడెం. ప్రకాశ్‌ అసలు పేరు నలుగోలు శ్రీనివాసరావు. 1985లో నక్సలైట్‌ ఉద్యమం కోసం కృష్ణా జిల్లాకు వెళ్లారు. ప్రజా గాయకుడు గద్దర్‌ పాల్గొన్న సభలో ఆయనతో కలసి పాట పాడాలనుకున్నాడు. కానీ ఆయన తనను వేదిక నుంచి దించేయటంతో అవమాన భారంతో రగిలిపోయాడు.



ఆ కసితో కుమారక్క నుంచి ఒగ్గుకథలు, డప్పు రమేశ్‌ను చూసి డప్పు వాయించటం నేర్చుకున్నాడు. దళితులపై ఎక్కడ ఘోరం జరిగిందని తెలిసినా ప్రత్యక్షమైపోయి.. తన పాట, డప్పుతో ప్రజల్ని చైతన్యవంతం చేసేవాడు. ఈ క్రమంలో కారంచేడు, చుండూరు సహా ఉమ్మడి ఏపీలో డప్పు ప్రకాశ్‌గా పేరు సంపాదించాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top