ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ | CM Ys Jagan Writes Letter To PM Modi On CoronaVirus Lockdown | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ

Apr 30 2020 10:17 PM | Updated on Apr 30 2020 10:29 PM

CM Ys Jagan Writes Letter To PM Modi On CoronaVirus Lockdown - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి, తాడేపల్లి: కరోనా లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గురువారం ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగం పూర్తిగా స్తంభించిపోయిందని ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు. అదేవిధంగా పరిశ్రమల్లో పెద్ద ఎత్తున​ ఉత్పత్తి నిలిచిపోయిందని, ఇతర ప్రాంతాలకు రవాణా, ఎగుమతులు కూడా లేవన్నారు. కార్మికులు హాజరుకాకపోవడంతో ఉత్పత్తిరంగం స్తంభించిందని, దీంతో పారిశ్రామిక రంగం భవిష్యత్‌పై సీఎం జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

‘దేశ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. అలాంటి తయారీ రంగం లాక్‌డౌన్‌తో తీవ్రంగా దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం అదుకోవాలని కోరుతున్నాను. ఎంఎస్‌ఎంఈలు పారిశ్రామిక రంగానికి వెన్నెముక లాంటివి. ఏపీలో 11 లక్షల మంది వీటిపై ఉపాధి పొందుతున్నారు. అలాంటి 94 శాతం ఎంఎస్‌ఎంఈలు ఇప్పడు లాక్‌డౌన్‌ అయ్యాయి. 6 శాతం ఎంఎస్‌ఎంఈలు 25 నుంచి 30 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఈ ఎంఎస్‌ఎంఈలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. వీటికోసం ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేయాలి. లాక్‌డౌన్‌ కాలంలో కార్మికుల వేతనాల కోసం ఇఎస్‌ఐసీ నిధులు వినియోగించాలి.

పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ చెల్లింపులపై ఆరు నెలలు ఎంప్లాయర్ కి మారటోరియం విధించాలి. ఎంఎస్ఎంఈ ల తీసుకున్న అన్ని రుణాల వాయిదా చెల్లింపులపై 12 నెలలు మారటోరియం ప్రకటించాలి. ఎంఎస్ ఎంఈలకు పెండింగ్ చెల్లింపులన్నింటినీ తక్షణమే విడుదల చేయాలి. మినిమమ్ డిమాండ్ విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయాలి. టెక్స్ టైల్ రంగం లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఏపీలో 2 లక్షల 50 వేల మంది 120 స్పిన్నింగ్ మిల్లుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. టెక్స్ టైల్ రంగాన్ని ఆదుకోవడానికి రుణాల వడ్డీ రేటు తగ్గించాలి. నాలుగు త్రైమాసికాల రుణాలు చెల్లింపులపై మారటోరియం విధించాలి. టెక్స్ టైల్ పరిశ్రమలు యాంటీ డంపింగ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ చెల్లింపుల నుంచి మినహాయింపు కోరుతున్నాయి. ఆటో మొబైల్ రంగం కొత్త వాహనాలకు జీఎస్టీ రేట్ తగ్గించాలని కోరుతున్నాయి’ అని ప్రధానికి రాసిన లేఖలో సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

చదవండి:
ఎంఎస్ఎంఈలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఊపిరి..
అందరూ అదే మాట.. నిజం చెప్పిన నేత

Advertisement
 
Advertisement
Advertisement